39దేశాల్లో ఆరెస్సెస్: అందుకే పిల్లల్ని శాఖలకి పంపిస్తున్న ఎన్నారైలు
ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) 39 దేశాల్లో విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ముప్పై తొమ్మిది దేశాల్లో ఆరెస్సెస్కు శాఖలు ఉన్నాయి. 1925 డాక్టర్ హెడ్గేవార్ ఆరెస్సెస్ను స్థాపించారు. అప్పటి నుంచి అది ఎదుగుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎన్నో దేశాలకు విస్తరించింది.
విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు తమ పిల్లలను ఆరెస్సెస్ నిర్వహిస్తున్న 'శాఖ'లకు పంపిస్తున్నారు. దానికి గిరీష్ బగ్మర్ అనే మహారాష్ట్ర వ్యక్తి మంచి ఉదాహరణ.
ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుతం బోస్టన్లో ఉంటున్నారు. అతను తన ఇద్దరు పిల్లలను ఆరెస్సెస్ లేదా హెచ్ఎస్ఎస్ నిర్వహించే శాఖకు పంపిస్తున్నారు. ఆరెస్సెస్ను విదేశాల్లో హిందూ స్వయంసేవక సంఘ్ (హెచ్ఎస్ఎస్) అంటారు.
అమెరికాలో చాలామంది ఎన్నారైలు హెచ్ఎస్ఎస్ కోసం పని చేస్తున్నారు. అంతేకాదు, తమ పిల్లలను శాఖకు పంపిస్తున్నారు.
నేను చిన్నప్పుడు శాఖకు ఎప్పుడు పోలేదని, కానీ శాఖలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారని, అందుకే నా పిల్లల్ని పంపిస్తున్నానని, మేం చిన్నప్పటి నుంచి మన కల్చర్ గురించి తెలుసుకున్నామని, ఇప్పుడు ఇక్కడ మా పిల్లలకు అలాంటి సంస్కృతిని మిస్ చేయలేమని, అందుకే శాఖకు పంపిస్తున్నామని బగ్మర్ చెప్పారు.
హెచ్ఎస్ఎస్ లేదా ఆరెస్సెస్ శాఖలు ఉన్న 39 దేశాల్లో అమెరికా కూడా ఉంది. చిన్మయా, రామకృష్ణ మిషన్లతో పాటు హెచ్ఎస్ఎస్ కూడా విదేశాల్లో పని చేస్తోంది.
విదేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని పిలవలేమని ఆరెస్సెస్ ఓవర్సీస్ ముంబై కోఆర్డినేటర్ రమేష్ సుబ్రహ్మణ్యం చెప్పారు. భారత దేశంలో మన దేశం కాబట్టి రాష్ట్రీయ అంటున్నామని, విదేశాల్లో రాష్ట్రీయ అనలేమని, అందుకే హిందూ స్వయంసేవక సంఘ్ అంటున్నామని చెప్పారు. ఆరెస్సెస్ మాతృసంస్థ కాగా.. 40 వరకు అనుబంధ సంస్థలు ఉన్నాయి.