నిలువ నీడ కోల్పోయిన విజయ్ మాల్యా: లండన్ ఇంటిని స్వాధీనం చేసుకోనున్న స్విస్ బ్యాంక్
లండన్: వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా.. నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నట్టే. దాదాపుగా ఆయన రోడ్డు మీద పడ్డట్టే. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్లోని విలాసవంతమైన బంగళా కూడా చేజారిపోయింది. ఆ బంగళాను స్విస్ బ్యాంక్ యూబీఎస్ స్వాధీనం చేసుకోనుంది. దీన్ని కాపాడుకోవడానికి విజయ్ మాల్యా ఇన్ని రోజులుగా చేస్తూ వస్తోన్న న్యాయపోరాటాలు వృధా అయ్యాయి.
లండన్లో తల్లి, కుమారుడితో..
సుమారు 9,500 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఎగవేసిన విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్లో ఉంటోన్నారు. లండన్ రీజెంట్స్ పార్క్ ప్రాంతంలో ఉంటుందీ 18/19 కార్నెల్ టెర్రాస్ లగ్జరీ అపార్ట్మెంట్. 95 సంవత్సరాల వయస్సున్న తల్లి లలిత, కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి విజయ్ మాల్యా లండన్లోని ఈ ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తోన్నారు.
20.4 మిలియన్ పౌండ్ల లోన్..
ఆయనకు స్వదేశానికి రప్పించడానికి భారత్.. సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు సాగిస్తోంది. అవేవీ కొలిక్కి రావట్లేదు. స్వదేశానికి తీసుకుని రావడానికి భారత్ చేస్తోన్న ప్రయత్నాలను ఆయన న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆ అపార్ట్మెంట్ను కోల్పోయారు. స్విస్ బ్యాంక్ దీన్ని స్వాధీనం చేసుకోనుంది. 20.4 మిలియన్ పౌండ్ల రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన స్విస్ బ్యాంక్..
విజయ్ మాల్యా నుంచి తనకు రావాల్సిన రుణాల కోసం స్విస్ బ్యాంక్.. లంఢన్ హైకోర్టును ఆశ్రయించింది. లండన్ ఛాన్సెరీ డివిజన్ ఆఫ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ భారీ అపార్ట్మెంట్ను నిలబెట్టుకోవడానికి విజయ్ మాల్యా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ కేసులో ఓడిపోయారు. రుణాలను చెల్లించడానికి తనకు ఇంకొంత సమయం కావాలంటూ విజయ్ మాల్యా చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఛాన్సెరీ డివిజన్ అంగీకరించలేదు. గడువు పొడిగించడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని హైకోర్టు డిప్యూటీ మాస్టర్ మాథ్యూ మార్ష్ పేర్కొన్నారు.
కేసులో ఓడిన మాల్యా..
గడువు పొడిగించినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని భావిస్తున్నట్లు చెప్పారు. రుణాల రికవరీలో భాగంగా ఈ ఇంటిని తమకు అప్పగించాలంటూ స్విస్ బ్యాంక్ చేసిన వాదన హేతుబద్ధమైనదేనని పేర్కొన్నారు. విజయ్ మాల్యా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నట్లు తీర్పు ఇచ్చారు. తాత్కాలికంగా స్టే ఇవ్వడానికీ హైకోర్టు డిప్యూటీ మాస్టర్ మాథ్యూ మార్ష్ నిరాకరించారు. అలాగే- అప్పీల్ చేసుకునే వెసలుబాటును కూడా కల్పించలేదు.
అప్పీల్కూ నో ఛాన్స్..
అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నానని మార్ష్ స్పష్టం చేశారు. 95 సంవత్సరాల వయస్సు ఉన్న తల్లిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలంటూ మాల్యా తరఫు బారిస్టర్ డేనియల్ మార్గొలిన్ చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చని స్విస్ బ్యాంక్ తరఫు బారిస్టర్ ఫెన్నెర్కు అనుమతి ఇచ్చారు. ఫలితంగా విజయ్ మాల్యా లండన్ నివాసాన్ని ఇప్పటికిప్పుడు యూబీఎస్ స్విస్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
2019 నుంచీ..
విజయ్ మాల్యా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన రోజ్ క్యాపిటల్ వెంచర్స్ కోసం చేసిన మార్టగేజ్కు సంబంధించిన కేసు ఇది. 2019 నుంచీ సాగుతూ వస్తోంది. తొలిసారిగా ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో విజయ్ మాల్యా- లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కొంత గడువు కావాలంటూ అభ్యర్థించారు. దీనితో హైకోర్టు డివిజన్.. 2020 ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాల్యా చేసిన విజ్ఞప్తి మేరకు దీన్ని మళ్లీ 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచింది. మరోసారి గడువు పెంచడానికి అంగీకరించలేదు.