కరోనా విలయం: చైనా డేంజరస్ గేమ్.. అమెరికాను మించి లక్షల్లో మరణాలు.. వూహాన్పై దాడికి ట్రంప్ సంకేతాలు
అన్ని దేశాల అధికారిక ప్రకటనల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 23.32లక్షలు. అందులో సుమారు 6లక్షల మంది వ్యాధి నుంచి బయటపడగా, 1.60లక్షల మంది చనిపోయారు. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 7.39లక్షల మంది కొవిడ్-19 వ్యాధికి గురికాగా, రికార్డు స్థాయిలో 39వేల మంది చనిపోయారు. క్రిటికల్ కేసుల్ని బట్టి యూఎస్ మరణాలు ఈ వారంలోనే 50వేలు దాటే అవకాశముంది. ఇటలీలో 23వేల పైచిలుకు, స్పెయిన్ 21, ఫ్రాన్స్ 20, యూకేలో 16వేల మరణాలు సంభవించాయి. కరోనా పుట్టిన చైనాలో మాత్రం మొన్నటిదాకా మరణాల సంఖ్యను 4వేల లోపే అని చెప్పి, ఇప్పుడు దాన్ని 4,632కు సవరించారు. కానీ ఈ నంబర్ కూడా ఫేకే అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
అమెరికా నంబర్ 1 కాదు..
ప్రపంచంలోనే అత్యంత ధనిక, హెల్త్ కేర్ సహా చాలా రంగాల్లో టాప్ లో ఉండే అమెరికా, యూరోపియన్ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ దారుణంగా ఉండటం, పెద్దగా హెల్త్ కేర్ సదుపాయాలు లేని దేశాల్లో పరిస్థితి మరో లా ఉండటం, చైనా, ఇరాన్ లాంటి దేశాల్లోనైతే మరణాలు ఆగిపోవడం లేదా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రావడంపై చాలా రకాల సందేహాలు రాకమానవు. దీన్నే చైనా డేంజరస్ గేమ్ గా అభివర్ణించారు అమెరికా ప్రెసిడెంట్. ‘‘మరణాల్లో అమెరికా నంబర్ 1 కాదు. మాకంటే చైనాలో ఊహించలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ విషయాన్ని వాళ్లు దాచిపెడుతున్నారు. చైనాలో మరణాల రేటు 0.33 శాతం అనేది ఫేక్''అని చెప్పారు.
చైనాలో కొత్తగా 1600 మృతులు..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేశామని, అది పుట్టిన వూహాన్ లో లాక్ డౌన్ కూడా ఎత్తేశామని, వైరస్ పై పోరాటంలో ప్రపంచ దేశాలకు సాయం కూడా చేస్తున్నామంటూ చైనా చెబుతోన్న విషయాలన్నీ అబద్ధాలేనని ట్రంప్ అన్నారు. వైరస్ విషయంలో అమెరికా ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాతే చైనా మరణాల సంఖ్యను సవరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. చైనా ఈ పనులన్నీ ఉద్దేశపూర్వకంగా చేసుంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, 1917(మొదటి ప్రపంచ యుద్ధం) తర్వాత అతి ఎక్కువ మంది బలైపోయిన ఈ అంశాన్ని తేలికగా తీసుకోబోమని హెచ్చరించారు.
వూహాన్ ల్యాబ్ ను పరిశీలిస్తాం..
‘‘కరోనా వైరస్ పుట్టుకకు కారణంగా భావిస్తోన్న వూహాన్ వైరాలజీ ల్యాబ్ పై గతంలోనే మేం హెచ్చరికలు చేశాం. దాన్ని పరిశీలిస్తామని రెండు సార్లు కోరినా చైనా నిరాకరించింది. ఇప్పటికైనా అక్కడేం జరుగుతుందో బయటపెట్టాలి. బహుశా, ఆ దేశానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే సంఘటనలే అక్కడ జరిగుండొచ్చు. లేకుంటే ఎందుకిలా నటిస్తారు? చైనాపై నాకు ప్రత్యేకంగా కోపమేం లేదు. కాకుంటే, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఇంత ప్రమాదకరమైన వైరస్ గురించి నిజాలు దాచిపెట్టడం ముమ్మాటికీ నేరమే'' అని ట్రంప్ అన్నారు.
స్ట్రాంగ్ వార్నింగ్..
తమ దేశంలో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి చైనా చెప్పడంలేదని, అందువల్లే మిగతా దేశాలన్నీ కరోనా విలయంలో చిక్కుకుపోయాయని, అయితే ఇప్పటికైనా చైనా నిజాల్ని చెప్పాలని, లేకపోతే బలవంతంగానైనా వాళ్లతో కచ్చితంగా నిజాలు కక్కిస్తానని, ఆ రోజు తొందర్లోనే చూస్తారని ట్రంప్ సీరియస్ గా హెచ్చరించారు. వూహాన్ ల్యాబ్ వివరాల్ని బయటపెట్టాలని, అవసరమైతే ‘లోపలికి ప్రవేశించి తీరుతాం'అని యుద్ధభాషను కూడా ట్రంప్ ఉచ్ఛరించారాయన. ఇకపై చైనాతో బంధం ఎలా ఉండాలనేది వాళ్లు చెప్పబోయే నిజాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
Recommended Video