పెళ్లి పార్టీలో గ్యాంగ్ వార్: 21 మంది అంతం
కాబూల్: పెళ్లి జరిగిన ఇంటికి విందుకు వెళ్లిన 21 మంది బంధువులు తుపాకి తూటాలకు బలి అయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. కాబూల్ నగరం సమీపంలోని ఒక గ్రామంలో ఒక పెళ్లింట ఈ దారుణ సంఘటన జరిగింది.
కాబూల్ నగరం సమీపంలోని దెహస్లా గ్రామంలో ఆదివారం పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు వెళ్లారు. పెళ్లి జరిగిన తరువాత ఎర్పాటు చేసిన విందులో చిన్న గొడవ జరిగింది. ఆ సందర్బంలో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి విషమించింది.
అంతే రెండు వర్గాల వారు పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఈ దాడులలో 14 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న 21 మంది సంఘటనా స్థలంలో మరణించారని సీనియర్ పోలీసు అధికారి గులిస్థాన్ క్వుసాని చెప్పారు.
ఈ దాడిలో 10 మంది గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. చాల సంవత్సరాల నుండి రెండు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయని, పెళ్లి విందులో పగ తీర్చుకోవడానికి ప్రయత్నించి పరస్పరం కాల్పులు జరుపుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.