సింధు , సిమ్లా ఒప్పందాలకు బ్రేక్..! ఆ కీలక పరిణామాలు తప్పవా ?
జమ్మూకశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపేసింది. అలాగే పాకిస్తాన్ 1972 నాటి సిమ్లా ఒప్పందం అమలును నిలిపేసింది. ఈ రెండు ఒప్పందాల నిలిపివేత వల్ల ఇరుదేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇవి కచ్చితంగా ఇరు దేశాలపై ప్రభావం చూపబోతున్నాయి. అలాగే భారత్-పాక్ ఇద్దరూ వీటిపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాయి.
1960లో భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం దీని ఉపనదుల నీటిని ఇరుదేశాలూ పంచుకుంటున్నాయి. ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం కుదరదని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఉమ్మడి అంగీకారం, ఒప్పందం ద్వారా మాత్రమే సింధు జలాల ఒప్పందాన్ని మార్చే, లేదా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.

సింధు నదీ ఒప్పందం నిలిపివేతకు భారత్ చూపించిన కారణాల్లో - 1960 నుండి పరిస్థితులలో వచ్చిన మార్పులు, భారతదేశంలో జనాభా మార్పులు, స్వచ్ఛమైన ఇంధన అభివృద్ధి కోసం అత్యవసరం, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదం వంటివి ఉన్నాయి. అలాగే ఈ ఒప్పందాన్ని ఇరుపక్షాలు విశ్వాసంతో గౌరవించాలని అప్పట్లో నిర్ణయించారు. దీన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినట్లు భారత్ వాదిస్తోంది.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూస్తే ఇలా దేశాల మధ్య కుదిరే ఒప్పందాలను నిలిపివేయడం వియన్నా ఒప్పందం ప్రకారం చెల్లదు. కేవలం పరిస్థితులలో ప్రాథమిక మార్పు వంటి నిర్దిష్ట సందర్భాలలో మాత్రమే ఒప్పందాల రద్దు లేదా సస్పెన్షన్ను ఇది అనుమతిస్తుంది.అయితే వీటిని సాధారణ పరిస్దితుల్లో అంతర్జాతీయ కోర్టు అనుమతించదు. అలాగే సింధు నదీ జలాల ఒప్పందంలో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం శాశ్వత సింధు నదీ జలాల కమిషన్, ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్ధ నిపుణుడు, శాశ్వత వివాద పరిష్కార కోర్టు ద్వారా మాత్రమే వీలవుతుంది. 2016లో పాకిస్తాన్ ఇలా నేరుగా వివాద పరిష్కార కోర్టును ఆశ్రయించింది. భారత్ మాత్రం తమ దేశంలో విచారణ జరుగుతున్నందున ఈ విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ మరోసారి సింధు జలాల కోర్టును ఆశ్రయించినా భారత్ ఇదే వైఖరి కొనసాగించబోతోంది.

మరోవైపు 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం ఇరుదేశాల మధ్య శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. అలాగే భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)ని పొరుగుదేశం గుర్తిస్తోంది. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ నిలిపేయడంతో ఎల్ఓసీని గుర్తిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం అమలు కాదు. వాస్తవానికి సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. 1999లో జరిగిన కార్గిల్ తిరుగుబాటే దీనికి నిదర్శనం. భారత్ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా ఈ ఒప్పందం ఉల్లంఘనే అని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
అటు భారత్ తీసుకున్న సింధు జలాల ఒప్పందం నిలిపిపేత నిర్ణయం, పాకిస్తాన్ తీసుకున్న సిమ్లా ఒప్పందం నిలిపివేత నిర్ణయాలు ఆచరణలో ఏ విధంగా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇందులో సింధు జలాల ఒప్పందం నిలివేతతో పాకిస్తాన్ కు తక్షణం ఈ నీరు అందకుండా ఆపడం సాధ్యం కాదని తేలిపోయింది. అయితే దౌత్య ఉద్రిక్తతలకు మాత్రం కారణమవుతోంది. అలాగే సిమ్లా ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ ఎల్ఓసీ గుర్తింపును తిరస్కరిస్తున్నట్లు అవుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదంతో దాన్ని ఎప్పుడో ఉల్లంఘించింది.












Click it and Unblock the Notifications