ఇది ఫేస్బుక్ను డిలీట్ చేయాల్సిన టైమ్: వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ సంచలనం
వాషింగ్టన్: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్లోని కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే సంస్థ దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టాన్ ఫేస్బుక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఇది ఫేస్బుక్ను డిలీట్ చేయాల్సిన సమయం' అంటూ బ్రియాన్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5కోట్లమంది ఫేస్బుక్ ఖాతాల సమాచారం చిక్కిందని వార్తలు వచ్చాయి. ఈ లీక్పై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అమెరికా సహా బ్రిటన్ ఈయూ దేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్కు నోటీసులు పంపింది. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ఫేస్బుక్పై తమకు విశ్వాసం పోతోందని ఇప్పటికే పలువురు యూజర్లు ఇతర సోషల్మీడియాల ద్వారా తమ అసంతృప్తిని వెల్లడించారు. గత రెండు మూడు రోజుల నుంచి 'డిలీట్ఫేస్బుక్' హ్యాష్ట్యాగ్ వైరల్గా మారింది. తాజాగా వాట్సప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ కూడా ఇదే హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
It is time. #deletefacebook
— Brian Acton (@brianacton) March 20, 2018
జాన్ కౌమ్తో కలిసి వాట్సప్ను ప్రారంభించిన బ్రియాన్ గత ఏడాది సంస్థ నుంచి వైదొలిగారు. మరో ఫౌండేషన్ కోసం వాట్సప్ను వీడినట్లు బ్రియాన్ ఆ సందర్భంలో ప్రకటించారు. కాగా, 2014లో వాట్సాప్ను 16 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 1.04లక్షల కోట్లు) ఫేస్బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.