పార్కింగ్ స్థలం కోసం కొడుకుని 20 ని.లు ఎండలో కూర్చుండబెట్టింది
కౌలాలంపూర్: కారు పార్కింగ్ స్థలం కోసం తన కొడుకును ఎర్రటి ఎండలో ఇరవై నిమిషాల పాటు నిలబెట్టిన ఓ తల్లి పైన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన కౌలాలంపూర్లోని జలన్ కుచాయి లామా ప్రాంతంలో జరిగినట్లుగా భావిస్తున్నారు.
సాధారణంగా నగరాల్లో పార్కింగ్ స్థలం కోసం కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ తల్లి కారు పార్కింగ్ స్థలం కోసం ఎండలో కొడుకును నిలబెట్టి, నెటిజన్ల ఆగ్రహానికి గురయింది.
కౌలాలంపూర్లోని జలన్ కుచాయి లామా రోడ్ నిత్యం బిజీగా ఉంటుంది. అక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. అలాంటి చోట తన కారుని పార్క్ చేయడానికి సదరు మహిళకు ఒకచోట ఖాళీ కనిపించింది. అంతే, అక్కడ కారు పెట్టుకుంటే చాలా సేపు షాపింగ్ చేసుకోవచ్చని భావించింది.
వెంటనే తన కొడుకుని అక్కడ కూర్చోమని చెప్పింది. అక్కడ ఎవరైనా కారు పెట్టేందుకు వస్తే తన తల్లి కారుతో వస్తోందని చెప్పమని చెప్పింది. దూరంగా ఎక్కడో వదిలిన తన కారును తీసుకొచ్చేందుకు ఆమె వెనక్కి వెళ్లింది. ఆమె కారు తెచ్చేందుకు ఇరవై నిమిషాలు పట్టింది.
అంతసేపు ఆ కొడుకు అలాగే ఎండలో ఒంటరిగా కూర్చున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న వారు బాబు తప్పిపోయాడని భావించి ఆరా తీశారు. అతను విషయం చెప్పాడు. దీంతో వారు షాకయ్యారు. వారిలో ఓ వ్యక్తి ఆ బాబు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు. జరిగినదంతా సోషళ్ మీడియాలో వివరించాడు.