చంద్రుడిపై అడుగు..: చంద్రయాన్ 2 ప్రయోగంపై నాసా ఏమందంటే..?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ప్రశంసల వర్షం కురిపించింది. చంద్రయాన్ 2 అసంపూర్తిగా మిగిలిపోవడం కొంత నిరాశకు గురిచేసినప్పటికీ.. ఇస్రో చేసిన ఈ ప్రయత్నం తామందరికి స్ఫూర్తి దాయకమని కొనియాడింది.
ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-2 ప్రయోగం విక్రమ్ ల్యాండర్తో సంకేతాలు తెగిపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయినా ఇస్రో చేసిన ప్రయత్నాన్ని దేశం యావత్తు అభినందించింది. ప్రపంచంలోని పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా తమ అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నాసా కూడా ఇస్రో ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్విట్టర్ ద్వారా మద్దతు తెలిపింది.

'అంతరిక్ష ప్రవేశం చాలా కష్టంతో కూడుకున్న పని. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ ద్వారా కాలుమోపాలన్న ఇస్రో ప్రయత్నాన్ని మేం ప్రశంసిస్తున్నాం. మీ ప్రయాణం మాలో స్ఫూర్తి నింపింది. సౌరకుటుంబంలో మనిద్దరి మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకునేందుకు ఇది అవకాశం కల్పించింది' అని నాసా పేర్కొంది.
Space is hard. We commend @ISRO’s attempt to land their #Chandrayaan2 mission on the Moon’s South Pole. You have inspired us with your journey and look forward to future opportunities to explore our solar system together. https://t.co/pKzzo9FDLL
— NASA (@NASA) September 7, 2019
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దేశ ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీ, శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ సంకేతాలు తెగిపోవడంతో కొంత నిరాశకు గురైనప్పటికీ.. మన శాస్త్రవేత్తలు కృషిని అభినందిస్తూనే ఉన్నారు. మరోసారి ప్రయత్నంలో విజయవంతం అవుతామని ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు భరోసా ఇచ్చారు. ప్రయోగం విజయవంతం కాకపోవడంతో కన్నీటిపర్యంతమైన ఇస్రో ఛైర్మన్ శివన్ను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇది ఇలా వుండగా, తాజాగా, ల్యాండర్ ఆచూకీని కూడా ఇస్రో కనిపెట్టిందని ఇస్రో ఆదివారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications