ధోనీ కెప్టెన్సీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్- ఏడో నంబర్లో వద్దు- నీకు అదే కరెక్ట్
ఐపీఎల్ అనగానే టాప్ త్రీ జట్లలో గుర్తుకొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్. అందులోనూ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. గతంలో టీమిండియా కెప్టెన్గా ఉంటూనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ధోనీ ఇప్పటికీ అదే పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే చెన్నై సూపర్కింగ్స్కు మునుపటితో పోలిస్తే అంత దూకుడుగా విజయాలు అందించలేకపోతున్నాడు. దీంతో ధోనీ కెప్టెన్సీతో పాటు టీమ్లో స్ధానంపైనా మరోసారి చర్చ జరుగుతోంది.
ప్రస్తుత ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడిన చెన్నై సూపర్కింగ్స్ పరాజయం మూటగట్టుకుంది. అదే సమయంలో ఏడోస్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ ధోనీ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో ధోనీ ఏడో స్ధానంలో బ్యాటింగ్కు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మంచి ఫినిషర్గా పేరున్నప్పటికీ మరీ ఏడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చి కెప్టెన్సీ భారం మోయడం తనకు సరికాదని ధోనీ మాజీ టీమిండియా సహచరుడు గౌతం గంభీర్ తేల్చిచెప్పేశాడు.
2012, 2014లో కోల్కతా నైట్రైడర్స్కు రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించిన గౌతం గంభీర్... కెప్టెన్ అనే వాడు జట్టును ముందుండి నడిపించాలని, చివరి స్ధానాల్లో రావడం సరికాదని స్పష్టం చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు రావడం వల్ల జట్టును లీడ్ చేయడం సాధ్యం కాదని గంభీర్ ధోనీకి తెలిపాడు. ఏడో స్ధానానికి బదులు మిడిల్ ఆర్డర్లో నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్కు రావడం వల్ల ధోనీ తనకు తాను బౌలర్లను ఎదుర్కొనే సమయం ఇచ్చుకున్నట్లు ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ లైవ్ విశ్లేషణలో తెలిపాడు.
ధోనీ నాలుగైదేళ్ల క్రితం ధోనీ కాదని, అప్పట్లో రావడంతోనే బౌలర్లను బాదేసే పరిస్దితి ఉండేదని, కానీ ఇప్పుడు అలా కుదరదని గంభీర్ వెల్లడించాడు. అందుకే నాలుగైదు స్దానాల కంటే లోయర్ ఆర్డర్లో ధోనీ బ్యాటింగ్ చేయకూడదని గంభీర్ కీలక సూచన చేశాడు. గతేడాది ఐపీఎల్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ప్లే ఆఫ్కు కూడా చేరకుండానే చతికిలపడింది. అదే సమయంలో ధోనీ కెప్టెన్సీతో పాటు ఫామ్పైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కనీసం ఈ ఐపీఎల్లో అయినా ధోనీ సత్తా చూపాలని అతని టీమిండియా మాజీ సహచరుడు గంభీర్ కోరుకుంటున్నాడు.