నేడు సీఎం హోదాలో జగన్ సొంత జిల్లా పర్యటన .. జమ్మలమడుగు సభపై సర్వత్రా ఆసక్తి
వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సొంత జిల్లాలో తన తండ్రి వై ఎస్సార్ జయంతి వేడుకలతో పాటు అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. తన తండ్రి, దివంగత రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి వేడుకల కోసం ఇడుపులపాయ వెళ్తునారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి జులై 8 తేదీని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిం చింది . అలాగే అయన ఈ రోజునే వైసీపీ ప్రభుత్వ పెంచిన ఫించన్లను అందజేస్తున్నారు.

కడప జిల్లాలో సీఎం గా జగన్ తొలి పర్యటన .. వైఎస్సార్ జయంతితో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా జులై 8న అంటే నేడు తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రత్యేకవిమానంలో కడప చేరుకోనున్న జగన్, నేరుగా ఇడుపులపాయ వెళ్లి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జగన్ మోహన్ రెడ్డి . గండిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో వైఎస్సార్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు.

జమ్మలమడుగులో భారీ బహిరంగ సభ .. పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం
అనంతరం 11 గంటల 15 నిమిషాలకు జమ్మలమడుగులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు జగన్ . జగన్ పాల్గొంటున్న ఈ సభ కోసం ముద్దనూరు రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 20,000 మంది, సభా వేదికపై 75 మంది కూర్చొనేలా ఏర్పాటు చేశారు.జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందగా, పార్టీ నేతలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ కొండారెడ్డి తదితరులు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం జమ్ములమడుగులో జగన్ బహిరంగ సభను నిర్వహించనుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ సభలో వైఎస్సార్ పింఛను కానుక, రైతులకు లబ్ది చేకూర్చే పలు ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి.

జమ్మల మడుగులో సభ నిర్వహించటానికి కారణాలివే .. సభపై నెలకొన్న ఆసక్తి
జమ్మలమడుగుతో విడదీయరాని బంధం ఉన్న జగన్ మోహన్ రెడ్డి అక్కడే బహిరంగ సభ నిర్వహించటానికి కారణాలున్నాయి. వైయస్సార్ పుట్టి, పెరిగింది మరియు వైద్యుడిగా సేవలు అందించిందీ జమ్మలమడుగులోనే కావటంతో ఆయన పుట్టిన ప్రాంతంలోనే ఆయన జన్మదినం నాడు తన ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా సామాజిక పెన్షన్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. అంతే కాకుండా జమ్మల మడుగు లో మంత్రి ఆది నారాయణ రెడ్డి గతంలో పలు మార్లు జన్మలో జగన్ సీఎం అయ్యేది లేదు అంటూ ఎద్దేవా చేశారు . ఆయనకు ఎన్నికల ఫలితాలతోనే సమాధానం చెప్పిన జగన్ , ఇప్పుడు తన పర్యటనతో పూర్తిగా రాజకీయంగా ఆదినారాయణ రెడ్డిని జీరో చెయ్యనున్నారు. అందుకే సొంత జిల్లాలో జగన్ తొలి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications