అప్పుడు సీబీఐ కోరాం..ఇప్పుడు ఎందుకు వద్దంటే: వివేకా హత్య విచారణలో: ప్రభుత్వ వాదన ఇలా..!
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రభుత్వం తమ వైఖరిని కోర్టు ముందుంచింది. వివేకా హత్య జరిగిన సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి సీబీఐ విచారణ కోరామని..ఇప్పుడు అవసరం లేదని వాదించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ మాజీ మంత్రి.. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి.. టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీని పైన ప్రభుత్వం తరపు న అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం హైకోర్టు ముందు తమ అభిప్రాయం స్పష్టం చేసారు. సీబీఐ అవసరం లేదని వాదించారు. రాజకీయంగానూ ప్రాధాన్యత ఉన్న కేసు కావటంతో..ఇప్పుడు ప్రభుత్వం కోర్టు ముందు చేసిన వాదనల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దీని పైన కోర్టు నిర్ణయం కీలకం కానుంది.
సీబీఐ ఇప్పుడు అవసరం లేదు..
గతంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నందున మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని అప్పట్లో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్ కోరారని..ఆయనతో పాటుగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును అభ్యర్థించారని..కానీ, ఇప్పుడు సిట్ దర్యాప్తు సక్రమంగా జరుగుతోందని అందుకే సీబీఐ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం హైకోర్టుకు నివేదించారు. వివేకా హత్య కేసు దర్యా ప్తును సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ మాజీ మంత్రి.. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైన హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ సమయం లో కోర్టు ఇప్పటికే ప్రభుత్వ వివరణ కోరింది. దీనికి స్పందనగా అడ్వకేట్ జనరల్ తమ అభిప్రాయం స్పష్టం చేసారు. సిట్ విచారణ సక్రమంగా ఉందని.. సీబీఐ అవసరం లేదని కోర్టుకు నివేదించారు. అదే సమయంలో పిటీషనర్లు మాత్రం సిట్ విచారణ పైన అనుమానాలు వ్యక్తం చేసారు.

అమాయకులను ఇరికించే యత్నం..
తొలుత వివేకా హత్య కేసు పైన సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతే పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సిట్ ఇప్పటికే బీటెక్ రవితో పాటుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సైతం విచారించింది. అయితే, ఆ హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని..తనకు ఏ మాత్రం దీనితో ప్రమేయం ఉన్నా కాల్చి ఎన్ కౌంటర్ చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత ఆది సైతం ఇదే కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసారు. కోర్టులో ఆది నారాయణరెడ్డి తరపున నియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ.. వివేకా హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అమాయకుల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం, డీజీపీల నియంత్రణ లేని స్వతంత్ర సంస్థలతో గానీ, లేదా సీబీఐతో గానీ దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications