అందుకే లేఖలు రాశా, వాటిని డోర్ డెలివరీ చేస్తాం: అన్నపిలుపులో జగన్
Recommended Video

కడప: జిల్లాలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీలో అన్న పిలుపు కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ వర్గాలకు చెందిన తటస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మీ ప్రాంతాల్లో మీరంతా మంచి చేయడం చాలా సంతోషకరమన్నారు.

సలహాలు, సూచనలు ఇవ్వండి
మిమ్మల్ని అందరినీ కలవాలనే లేఖలు రాశానని జగన్ చెప్పారు. ప్రజలకు మరింత మంచి చేసేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మీతో అనుబంధం ఈ ఒక్క సమావేశానికే పరిమితం కాదని, ఈ ప్రయాణం జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన, ఈ పరిస్థితిని మార్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

ఉద్యోగాలు ఎన్ని ఇచ్చామో లెక్క చెబుతాం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాల విప్లవం వస్తుందని జగన్ చెప్పారు. రాష్ట్రంలో 2.42 లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే దానిపై లెక్కలు కూడా చూపిస్తామని అన్నారు. గ్రామ సెక్రటరియేట్లో అదే గ్రామానికి చెందిన పదిమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.

నవరత్నాలు డోర్ డెలివరీ
నవరత్నాలు, ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామ వాలంటీర్ ద్వారా డోర్ డెలివరీ చేస్తామని జగన్ చెప్పారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకు వస్తామని తెలిపారు. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. గ్రామ సెక్రటరియేట్ల ద్వారా 1.40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్ నియామకాల ద్వారా 50 కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వీరిని గ్రామ సెక్రటరియేట్కు అనుసంధానం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications