వైఎస్ వివేకా హత్యోదంతానికి ఏడాది: జగన్ చేతిలో అధికార పగ్గాలు: అయినా తేలని కేసు: సీబీఐ
కడప: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురై ఆదివారం నాటితో ఏడాది పూర్తయింది. వైఎస్ వివేకా ప్రథమ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిళ సహా పలువురు కుటుంబ సభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ వివేకా ఘాట్ను సందర్శించారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
వివేకాకు నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు..
అనంతరం స్థానిక చర్చిలో నిర్వహించిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పులివెందులలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వారంతా హాజరయ్యారు. వివేకా చేసిన సేవలను స్మరించుకున్నారు. పులివెందుల సహా కడప జిల్లా అభివృద్ధి కోసం లోక్సభ సభ్యుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలను ప్రస్తావించారు.

ఏడాది గడిచినా తేలని మిస్టరీ..
ఇదిలావుండగా.. ఏడాది గడిచినప్పటికీ వైఎస్ వివేకా హత్య కేసు దోషులెవరనేది తేలలేదు. పులివెందులలోని తన స్వగృహంలో అత్యంత దారుణంగా వైఎస్ వివేకాను హత్య చేసిన వారెవరు? ఈ హత్యకేసులో ఎవరి ప్రమేయం ఉందనేది మిస్టరీగానే ఉండిపోయింది. ప్రభుత్వం మారి.. అధికార పగ్గాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి వచ్చినప్పటికీ.. వివేకా హత్యకేసులో ఎలాంటి ముందడుగు కనిపించకపోవడం చర్చనీయాంశమౌతోంది.

సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు..
చిక్కుముడిగా మారిన వైఎస్ వివేకా హత్యోదంతం మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యతను హైకోర్టు.. సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవలే కీలక ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు. తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చడానికి ఈ హత్య కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్పై విచారణ నిర్వహించిన అనంతరం హైకోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

త్వరలో ఉత్తర్వులు..
వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి బదలాయిస్తూ జగన్ సర్కార్ త్వరలోనే ఉత్తర్వులను జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ రంగంలోకి దిగితే.. ఈ హత్యకేసులో అసలు దోషులు ఎవరనేది తేలుతుందని వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా సునీత అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ కేసు అత్యంత కీలకంగా మారినట్టయింది.












Click it and Unblock the Notifications