వైఎస్ వివేకా హత్యకేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి బదిలీ: సీబీఐ ట్రిబ్యునల్ పరిధిలోకి
కడప: రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు స్థాన చలనం కలిగింది. ఇదివరకు ఇదే కేసులో కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పీ వరుణ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు ఏకంగా కేసు కూడా బదిలీ అయింది. ఈ కేసు సమగ్ర దర్యాప్తు మొత్తం ఇక పులివెందుల న్యాయస్థానం పరిధిలో ఉండదు. ఇది కడపలోని సీబీఐ ట్రిబ్యునల్ న్యాయస్థానానికి బదిలీ చేశారు.
కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పీ వరుణ్ రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయనను ఒంగోలు సెంట్రల్ జైలుకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో- ఒంగోలు జైలు సూపరింటెండెంట్గా పని చేస్తోన్న ప్రకాష్ను నియమించింది. ఈ హైప్రొఫైల్ హత్యకేసులో అరెస్టయిన నిందితులు ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్నారు. వారికి ప్రాణహాని ఉందంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బదిలీ చోటు చేసుకుంది.

ఇప్పుడు తాజాగా- ఈ కేసు కూడా కడప సీబీఐ ట్రిబ్యునల్ న్యాయస్థానానికి బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీీీబీఐ అధికారులు చేసిన అభ్యర్థన మేరకు పులివెందుల న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా- ఈ హత్యకేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న నిందితులు ఈ ఉదయం పులివెందుల న్యాయస్థానానికి హాజరయ్యారు. సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. మార్చి 8వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది.
అంతకుముందు- ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మెజిస్ట్రేట్ సమక్షానికి హాజరు పరిచారు. కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను కూడా పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఆయన కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వారి రిమాండ్ను పులివెందుల కోర్టు పొడిగించింది.












Click it and Unblock the Notifications