కేంద్రానికి జగన్ సర్కార్ మరో ప్రపోజల్: కరుణించడంపైనే డౌట్: రాజ్యసభ సాక్షిగా రిక్వెస్ట్
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వానికి మరో ప్రతిపాదనను పంపించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు పరిశీలనలోకి తీసుకుంటుందనేది అనుమానం కలిగించేందే. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా.. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న అంశాలు కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ తాజాగా చేసిన ఈ కొత్త డిమాండ్ ప్రతిపాదనలపై సానుకూల స్పందన వస్తుందనేది ఆసక్తి కలిగించేదే. కేంద్ర ప్రభుత్వం ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్లు, అప్పారెల్ పార్కు (MITRA)లను నెలకొల్పాలని సంకల్పించింది. దీన్ని నోటిఫై కూడా చేసింది. ఎంపిక చేసిన వేర్వేరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వాటిని మంజూరు చేయనుంది. 4,445 కోట్ల రూపాయలతో ఈ పార్కులు, రీజియన్లు ఏర్పాటు కానున్నాయి.

దీనివల్ల లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. దుస్తులు, అప్పారెల్స్, గార్మెంట్స్.. ఇలా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పార్కుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ పార్కులను ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించినట్టవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించింది.
ఇందులో ఒక రీజియన్ను ఏపీకి మంజూరు చేయాలని జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కడప జిల్లాలో ఏర్పాటు చేసిన కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్లో దీన్ని నెలకొల్పాలని సూచించింది. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ వివరాలు, దీనికి ఉన్న రోడ్-రైలు-ఎయిర్ కనెక్టివిటీ గురించి వివరిస్తూ ఓ బ్లూప్రింట్ను అందజేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇదే విషయాన్ని వైెఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సభలో ప్రస్తావించారు.

ఈ తరహా పార్క్ను ఏర్పాటు చేయడానికి ఏపీలో అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. కాటన్, సిల్క్ ఉత్పత్తిలో ఏకైక అతి పెద్ద రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. నాలుగున్నర లక్షల హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్, స్పిన్నింగ్, ప్రాసెసింగ్ సెక్టార్లు ఏపీలో ఉన్నాయని వివరించారు. కొప్పర్తి పారిశ్రామిక పార్క్ను నెలకొల్పిన కడప జిల్లా.. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉందని గుర్తు చేశారు. మిత్రా పార్కును మంజూరు చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతాన్ని ఆదుకున్నట్టవుతుందని చెప్పారు.

విజయసాయి రెడ్డి మాట్లాడే సమయంలో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తూ కనిపించారు. వేర్వేరు పార్టీలకు చెందిన 12 మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ వారు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. నినాదాలతో హోరెత్తించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి సభలో కనిపించింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే విజయసాయి రెడ్డి - కేంద్రానికి తన విజ్ఞప్తిని చదవి వినిపించారు. అనంతరం సభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications