బీజేపీలో కొత్తగా చంద్రబాబు కోవర్ట్..ఆయనే: బాంబు పేల్చిన శ్రీకాంత్ రెడ్డి
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలపై విమర్శలను సంధించారు. పైకి వేర్వేరుగా కనిపించినా, లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీల నాయకులకు చురకలు అంటించారు. ఏపీ బీజేపీ కాస్త బాబు జేబు పార్టీగా మారిందంటూ ఎద్దేవా చేశారు.

అసత్యకుమార్..
ఇవ్వాళ ఆయన కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే.. చంద్రబాబు అనుకూల మీడియా తనను నెత్తిన పెట్టుకుంటుందనే ఆత్రంతో బీజేపీ నేత సత్య కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తన పేరును అసత్యకుమార్గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల మద్దతు విషయంలో సొంత పార్టీ అధిష్టానంతో చీవాట్లు తిన్నాడని గుర్తు చేశారు.

బాబు జనతా పార్టీగా..
టీడీపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో సత్యకుమార్ ఈ మధ్యకాలంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఎగ్గొట్టి, కేసులకు భయపడి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్ కలిసి, ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ 2018లో డిక్లరేషన్ చేసిందని, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, వారి చేతిలో ఉన్న అంశాన్ని, చేసిన డిక్లరేషన్ను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.

వికేంద్రీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా
అధికార వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమా?.. అనుకూలమా? అనేది స్పష్టం చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం బాగుండాలని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలని మా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, దీన్ని ఎందుకు బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.

హోదాపై నోరుమెదపట్లేదెందుకు?
ఇప్పుడు చంద్రబాబుకు వెన్నుదన్నుగా సత్యకుమార్ లాంటివాళ్లు అమరావతి భజనలో భాగస్వామ్యులవుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన హామీపై సత్య కుమార్ ఎందుకు నోరు తెరవట్లేదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు తెలంగాణకు సహకరించాడని, అలాంటి నాయకుడికి సత్య కుమార్ వంతపాడుతున్నాడని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

చంద్రబాబును మోస్తోన్న సత్యకుమార్..
తన రాజకీయ స్వార్థంతో రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్న చంద్రబాబును సత్యకుమార్ భుజాన మోస్తోన్నాడని ఆరోపించారు. సత్యకుమార్, ఆయన అనుచరులకు కూడా అమరావతిలో భూములు ఉన్నాయని ఆరోపించారు. మీడియాలో కవరేజ్ కోసమో, చంద్రబాబు ప్రాపకం కోసమో తమ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తే సహించేది లేదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ప్లాంట్కు నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications