హుజూరాబాద్లో దసరా మొత్తం టీఆర్ఎస్దేనట: ఈటల రాజేందర్, రఘునందన్ రావు సంచలనం
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జమ్మికుంటలో కవాతు చేయాలని మహిళలు కోరుతున్నారని, తప్పకుండా త్వరలోనే చేస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.

కేసీఆర్ ఏది చెబితే హరీశ్ చేస్తున్నారన్న ఈటల
తనకు మద్దతుగా ఉన్న నాయకులను పట్టండని కేసీఆర్ ప్రగతి భవన్లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు అమలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈరోజు ఉన్న నాయకులు రేపు తనతో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గెలిచిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను గెలిపించింది మనం కాదా ? నా అండ వారికి లేకుండెనా? గెలిచారా? కానీ, ఇప్పుడు ఒక్కరు కూడా తనతో లేరని ఈటల అన్నారు. ఇన్నాళ్లు నా వెంట ఉన్నోళ్లంతా వెళ్లిపోయినా ప్రజలందరూ నాతో ఉన్నారు అనడానికి ఈ రోజు మీరు చేసిన ర్యాలీ నిదర్శనం అన్నారు.

హుజూరాబాద్లో దసరా టీఆర్ఎస్దేనట, కానీ.. : ఈటల
దసరా పండుగకు కూడా వాళ్ళే మాంసం, డబ్బులు పంపిస్తారట అంటూ టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. తన పేరు చెప్పుకోకుండా టీఆర్ఎస్ వాళ్లకు మొహం కూడా చెల్లడం లేదన్నారు. దసరా పండుగకు కూడా వాళ్లే మాంసం, డబ్బులు పంపిస్తారట, ఒక్కో ఓటుకు 10 వేలు ఇస్తారట, 50 వేలు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం తనకు వేయండని ఈటల రాజేందర్ కోరారు. కేసీఆర్ డబ్బు, మద్యం హుజురాబాద్ లో చెల్లవు అని ఆయన చెంప ఛెళ్లు మనిపించేలా 30వ తేదీ రోజు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం ఎలా గెలిచిందో.. గెలిచినట్లే హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. జమ్మికుంటలో కవాతు చేయాలని ఇక్కడ మహిళలు కోరుతున్నారు.. తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చారు.
Recommended Video

ఓడితేనే కేసీఆర్ నేలకు.. హరీశ్కు ఈటల పరిస్థితే.: రఘునందన్ రావు
మంగళవారం హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, సిరిసేడు గ్రామాల్లో దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచించే పరిస్థితికి వస్తాడని.. ఒకవేళ గెలిస్తే మాత్రం తాను ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి వస్తాడని వ్యాఖ్యానించారు. చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ, ఫించన్ల పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మన బిడ్డలకు ఉద్యోగాలు ఉంటే రెండు వేల పింఛన్లకు ఎదురు చూసే అవసరం ఉండదన్నారు. కమలం గుర్తుకు ఓటేస్తేనే కేసీఆర్ నేలపైకి వస్తాడని అన్నారు. పేదల కష్టాలు తెలిసిన ఈటల రాజేందర్ కు ఓటు వేసి అండగా నిలవాలని ఆయన కోరారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ అనుకుంటున్నాడని, హుజూరాబాద్ ఎన్నికలయ్యాక సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కూడా ఈటల రాజేందర్ లాంటి పరిస్థితే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక్కడ టిఆర్ఎస్ గెలిస్తే తాను ఏం చేసినా నడుస్తుందనే స్థితికీ కేసీఆర్ వస్తాడు జాగ్రత్త అని హెచ్చరించారు. ఈటల రాజేందర్ గెలిస్తేనే... కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచిస్తాడని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications