గల్ఫ్లో ఇంటి పెద్ద మృతి.. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ చేయూత.. నగదు అందజేసిన ఎమ్మెల్యే..
పొట్ట చేత పట్టుకొని.. ఉన్న ఊరిని, కన్నవారిని... భార్య బిడ్డలను సైతం వదలి గల్ఫ్ బాట పట్టాడు ఎడ్ల రాజం (47). గత పదేళ్లుగా బహ్రెయిన్లో పనిచేసేవాడు. అయితే అతని కుటుంబాన్ని విధి వెక్కిరించింది. గుండెపోటు రావడంతో రాజం చనిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్ అతను చనిపోగా.. కరోనా కాలంలో తీసుకొచ్చేందుకు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ శక్తివంచన లేకుండా కృషి చేసింది. మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చింది. అయితే ఆ కుటుంబం మాత్రం పెద్దను కోల్పోయింది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ మరోసారి ముందుకొచ్చింది. ఆ కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, గన్యారపు వెంకటేశ్ ప్రత్యేక చొరవ చూపారు. అక్కడినుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడ్డారో.. కుటుంబాన్ని ఆదుకునేందుకు కూడా అదేవిధంగా ముందుకొచ్చారు. చందాలు వేసి రూ.20 వేలు జమచేశారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన రాజం ఏప్రిల్ 14వ తేదీన చనిపోగా.. అక్కడినుంచి మృతదేహాం తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రతినిధులు కోరారు. ఆయన వెంటనే ఎమ్మెల్సీ కవిత సహకారంతో భారత రాయబారితో మాట్లాడారు. అలా డెడ్ బాడీ తీసుకొచ్చారు. తర్వాత మగ్గిడి రాజేందర్, గన్యారపు వెంకటేశ్ ఇతరులు కలిసి చందాలు కలెక్ట్ చేశారు. వాటిని ఇటీవల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన రాజేందర్, వెంకటేశ్ తదితరులను రాజం కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మీ రుణం తీర్చుకోలేమని కంటతడి పెట్టారు.