ద్రోహులకు పదవులా..? ఎమ్మెల్యే, మంత్రి అయ్యే అర్హత తమకు లేదా.. తుల ఉమ నిప్పులు
టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామాతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఆయన సహచర నేతలు.. గులాబీ దళపతిపై విరుచుకుపడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఈటల రాజేందర్తో సన్నిహితం కలిగిన నేత తుల ఉమ గళం విప్పారు. పార్టీలో తమకు జరిగిన అవమానాలను గుర్తుచేశారు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చారని విరుచుకుపడ్డారు. ఏ తాము ఎమ్మెల్యే/ మంత్రి పదవీ చేపట్టేందుకు అర్హత లేదా అని గరం అయ్యారు.

ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదా..?
ప్రజలతో మమ్మల్ని వేరు చేసే కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అభిప్రాయపడ్డారు. తమకు ఎమ్మెల్యే, మంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు. తాము ప్రజా పోరాటాల్లో ఉన్నవాళ్లమని గుర్తుచేశారు. ఉద్యమ ద్రోహులకే మళ్ళీ పదవులా? అని తుల ఉమ ప్రశ్నించారు. ఇదీ కల్వకుంట్ల చంద్రశేఖరుడికే చెల్లింది అని పేర్కొన్నారు.

ద్రోహులకు పదవులా..?
తెలంగాణ కోసం కష్టపడింది తాము అని చెప్పారు. స్వ రాష్ట్రం కోసం అహోరాత్రులు శ్రమించామని.. తమపై కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. మరీ ఉద్యమ ద్రోహులను పార్టీలోకి ఆహ్వానించి పదవులు ఇవ్వడం ఏం పద్దతి అని అడిగారు. సబితా ఇంద్రారెడ్డిని పిలిచి మరీ పదవీ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటీ అని అడిగారు. సునీత లక్ష్మారెడ్డికి కార్పొరేషన్ పదవీ ఎలా ఇస్తారని నిలదీశారు. తాము అధినేత కళ్లకు కనిపించలేదా అని అడిగారు. అంత ఎందుకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ప్రజలకు దూరంగా జర్మనీలో ఉంటున్నా ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.

తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి.. పుట్ట మధు..?
ఈటల రాజేందర్తో సన్నిహితంగా ఉండే నేతల్లో తుల ఉమ ఒకరు.. ఆమె రాజేందర్ తీసుకునే నిర్ణయంతో ముందడుగు వేస్తానని ప్రకటించారు. ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలతో కలిసి ఉన్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కూడా ఈటల రాజేందర్తో సన్నిహిత్యం ఉంది. కానీ ఆయనను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయవాద దంపతులు వామనరావు హత్య కేసును వెలికితీస్తోంది. ఇందులో మధు మేనల్లుడు బిట్టు శ్రీను, కుంట శ్రీను నిందితులు.. హత్యలో అతని పాత్ర గురించి ఆరా తీయడంతో మధు మిన్నకుండిపోయారని అనుకోవచ్చు. ఇప్పటికీ అయితే మధు రాజేందర్తో టచ్లో లేరు. భవిష్యత్లో చూడాలీ మరీ.

మంత్రి పదవీ ఆఫర్
ఈటల రాజేందర్ను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపిస్తారట. దీనికి సంబంధించి ఈటలకు బీజేపీ హై కమాండ్ మాట ఇచ్చిందని తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇవ్వడమే గాక.. కేంద్రమంత్రి వర్గంలోకి కూడా తీసుకుంటారని ఇన్ పుట్స్ వస్తున్నాయి. సహాయ మంత్రి పదవీ ఇచ్చి.. తెలంగాణలో మరింత బలపడాలని బీజేపీ ప్లాన్ అని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications