వైరా గురుకులంలో కరోనా కలకలం: 27 మంది విద్యార్థులకు సోకిన మహమ్మారి, అంతా ఇంటికి
ఖమ్మం: వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనావైరస్ మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 27 మంది విద్యార్థులు కరోనావైరస్ బారినపడ్డారు. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతంగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. దీంతో ఆ విద్యార్థినికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ క్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మి.. విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా.. మొత్తం 27 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా కరోనా బారినపడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళుతున్నారు.
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
భారతదేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది. ఇక ఇదే సమయంలో కరోనాతో 313 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,65,662 మంది మృతి చెందినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.
శనివారం 12,329 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 98.30 శాతానికి పెరిగింది. ఇక పాజిటివిటీ రేటు 0.36 శాతానికి తగ్గింది. ఇది 532 రోజుల కనిష్టానికి తగ్గింది.
Recommended Video
ప్రస్తుతం దేశంలో 1,22,714 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా కేరళ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో ఐదువేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా 1,16,50,55,210 మంది టీకాలు తీసుకున్నారు. శనివారం ఒక్కరోజే 67,25,970 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.