షర్మిలపై పోటీకి బీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు: హోరా హోరీనా - ఏకపక్షమా..!?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు ఖమ్మం వేదికగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. పార్టీ సీనియర్లు పొంగులేటి - తుమ్మల తీరు సందేహంగా మారింది. పొంగులేటి బీజేపీలోకి వెళ్లటం దాదాపు ఖాయమైంది. తుమ్మల తీరులో సడన్ ఛేంజ్ కనిపిస్తోంది. బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఇందు కోసం తుమ్మల డిమాండ్ కు బీఆర్ఎస్ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ డిమాండ్ ఆమోదం.. వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ కు ముడి పడి ఉంది. తుమ్మలకు అధినాయకత్వం ఇచ్చిన హామీ ఏంటి....
అలక వీడిన తుమ్మల - హామీ దక్కిందంటూ
కొంత కాలంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలు పొంగులేటి ..తుమ్మల పార్టీ మారుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పొంగులేటి బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 18న అమిత్ షా తో భేటీ కానున్నట్లు చెబుతున్నారు. ఖమ్మంలో ఈ నెల 18న బీఆర్ఎస్ జాతీయ సభకు నిర్ణయించారు. ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్ సడన్ గా సీనియర్ నేత తుమ్మలతో సమావేశం అయ్యారు. కీలక మంతనాలు సాగాయి. ఇప్పుడు తుమ్మల తిరిగి యాక్టివ్ అయ్యారు. పార్టీ సభ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో ఆయనకు స్పష్టమైన హామీ పార్టీ నుంచి వచ్చిందని విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో తుమ్మల కోరుకుంటున్నట్లుగా పాలేరు సీటు ఖరారు చేయటంతో పాటుగా.. జిల్లాలో ప్రాధాన్యత పైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా.. అనేక పదవులు నిర్వహించిన నేతగా తుమ్మలకు సముచిత గౌరవం దక్కుతుందని పార్టీ చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం.
పాలేరు లో షర్మిల వర్సస్ తుమ్మల..!
టీడీపీలో సుదీర్ఘ కాలం మంత్రిగా..కీలక నేతగా వ్యవహరించిన తుమ్మల రాష్ట్ర విభజనతో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలోనూ ముఖ్య నేతగా మారారు. 2016లో జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి తుమ్మల పైన విజయం సాధించారు. కానీ, ఆ తరువాత గులాబీ నేతలకు దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ కందాలకు సీటు ఖాయమని ఇప్పటి వరకు అందరూ భావించారు. కానీ, తుమ్మల రీ ఎంట్రీతో కందాల పరిస్థితి ఏంటనేది జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది. కందాలకు భారీ అనుచర గణం ఉంది. అదే విధంగా తుమ్మల బలమైన నేతగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. అక్కడ షర్మిల పైన బీఆర్ఎస్ అభ్యర్ది పోటీ చేస్తారా..లేక, పొత్తుల్లో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఈ సీటు నుంచి పోటీ చేస్తారా అనే చర్చలు వినిపించాయి. ఇప్పుడు తుమ్మలకు హామీ దక్కిందనే ప్రచారంతో పాలేరు లో తుమ్మల వర్సస్ షర్మిల గా పోటీ మారే అవకాశం కనిపిస్తోంది.
హోరా హోరీనా - మద్దతే కీలకం
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి కాంగ్రెస్ నేతలు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గం కావటంతో గట్టి పోటీ తప్పేలా లేదు. ఇదే స్థానం నుంచి సీపీఎం - సీపీఐ నేతలు తమ్మినేని - కూనంనేని కూడా పోటీలో దిగాలనే ఆలోచనతో ఉన్నారు. పొత్తుల పైన స్పష్టత వచ్చాక నిర్ణయం ఉండే అవకాశం ఉంది. షర్మిల తన సొంత నిధులతో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గెలవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో కార్యాలయం సిద్దం చేస్తున్నారు. అటు తుమ్మల బలమైన నేతగా ఉన్నారు. తుమ్మలకు సీటు ఇస్తే కందాల మద్దతిస్తారా అనేది మరో అనుమానం. ఈ పరిస్థితుల్లో షర్మిల పోటీ చేసే నియోజకవర్గంలో సీటు కోసమే హోరా హోరీ పోరు కనిపిస్తున్న వేళ..ఎన్నిక మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఖరారైతే...షర్మిల హోరా హోరీగా పోరాడక తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు పాలేరు రాజకీయం ఆసక్తిగా మారుతోంది.