సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం : కర్నూలుకు ఏపీ హైకోర్టు..!! ఆగస్టు 15న ప్రకటన..!!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి అనేక సంచలన నిర్ణయం తీసుకుంటున్న జగన్..మరో సెన్సేషనల్ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాయలసీమ వాసుల చిరకాల కోరిక అయిన కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అమరావతిలో ఏపీ హైకోర్టు కొనసాగుతోంది. అయితే, అన్ని కీలక విభాగాలు ఒకే చోట ఏర్పాటు చేయటం ద్వారా ఏపీలోని ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని..అధికార వికేంద్రీకరణ 13 జిల్లాల్లోనూ ఉండాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఎంతో కాలంగా కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమ యంలో విశాఖలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా జగన్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి ఈ మేరకు స్పష్టత ఇస్తారని సమాచారం.
ఏపీలో కేసీఆర్ పై అభిమానం హద్దులు దాటుతోంది..! నేతలు, మంత్రుల భజన.. జగన్ చెప్పారా ?
కర్నూలుకు హైకోర్టు బదిలీ...
ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఏర్పాటు అయిన కర్నూలు లోనే ఇప్పుడు తిరిగి హైకోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటు ద్వారా కర్నూలు హైకోర్టు కోల్పోయింది. ఇక, 2014 లో ఏపీ విభజన తరువాత తెలంగాణ ఏర్పాటు అనుభవాలను పరిగణలోకి తీసుకొని అధికారం మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించ వద్దంటూ శివరామక్రిష్టన్ కమిటీతో పాటుగా మేధావులు సూచించారు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో హైదరాబాద్ తరహాలోనే అన్ని ప్రధాన కార్యాలయాలను అమరావతి సమీపంలోనే ఏర్పాటుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీ హైకోర్టును సైతం అమరావతిలోనే ఏర్పాటు చేసారు. అయితే, తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో..కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అది అమలు కాలేదు. ఇక, జగన్ ముఖ్యమంత్రి కావటం తో ఇప్పుడు ఈ ప్రతిపాదన ఆచరణ రూపం సంతరించుకుంటోంది. అందులో భాగంగా మొత్తంగా హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, బెంచ్ ఏర్పాటు సరైన నిర్ణయమని.. అదే సమయంలో విశాఖలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మరి కొంత మంది ముఖ్యమంత్రి జగన్ కు సూచిస్తున్నారు.
రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే...ఇబ్బందే..
రాష్ట్ర విభజన తరువాత డెవలప్ మెంట్ మొత్తం క్రిష్టా..గుంటూరు జిల్లాలోనే కనిపించేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో..రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే అక్కడ భవిష్యత్ లో ఉద్యమాలకు అవకాశం ఉందని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు హెచ్చరించారు. అదే సమయంలో 1937లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు కావాల్సి ఉన్నా ..కాలేదు. ఉత్తరాంధ్ర..రాయలసీమ వాసుల సెంటిమెంట్ ను గౌరవించి రాయలసీమతో పాటుగా.. విశాఖలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పటు చేయాలని పలువురు మేధావులు ప్రభుత్వానికి సూచనలు చేసారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు ముఖ్యమంత్రులుగా పని చేసినా..రాయలసీమలో చెప్పుకోదగిన స్థాయిలో ఏ సంస్థ..కార్యాలయం అక్కడ లేకపోవటంతో ..తాను మాత్రం రాయలసీమ ప్రాంతం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా.. హైకోర్టు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కోస్తా ప్రజలకు తమ నుండి హైకోర్టు దూరం చేస్తున్నారనే భావన రాకుండా.. మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. దీంతో..ఇప్పటికే నిపుణులతో చర్చించిన తరువాత ఆగస్టు 15న సీఎంగా తొలి ప్రసంగంలో జగన్ దీని పైన స్పష్టత ఇవ్వనున్నారు.
కర్నూలు లో హైకోర్టు..లేదా బెంచ్..జగన్ ఏం చెబుతారు..
కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ హైకోర్టు ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అయితే, కొత్త నిర్ణయాలతో సమస్యలు రాకుండా ముందుగా అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రకటన వరకే పరిమితం కావాలని కొందరు ముఖ్యమంత్రికి సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు స్వాంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి జగన్ జెండా ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో చేసే ప్రసంగంలో దీని పైన స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే అమరావతిని పక్కన పెట్టేసారని చంద్రబాబు మొదలు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి..ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు విషయంలో ముఖ్యమంత్రి చేయబోయే ప్రకటన మీద ఆసక్తి నెలకొని ఉంది.