ఐసొలేషన్లో జిల్లా కలెక్టర్.. ముగ్గురు మంత్రులతో భేటీ.. ప్రభుత్వం అలర్ట్
కర్నూలు: ఏపీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కర్నూలు నగరంలో పలు ప్రాంతాలను హాట్స్పాట్గా ప్రకటించడం జరిగింది. ఇందులో బుధవారపేట కూడా ఉంది. హంద్రీ నది తీరంలో ఉన్న బుధవార పేటలో 20కి పైగా కరోనాపాజిటివ్ కేసులు నమోదు కావడంతో దాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ ఏరియాలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ కాలేజీ ఉంది. దీంతో ఇక్కడ పనిచేసే వైద్యులు, నర్సులు , ఇతర పారామెడికల్ సిబ్బంది చాలావరకు బుధవారపేటలోనే నివసిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగానే కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. ఇక కొద్ది రోజుల క్రితం కలెక్టర్ వీరపాండ్యన్ రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో ఆయన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం.
బుధవారపేటలోనే కలెక్టర్ కార్యాలయం
కర్నూలు నగరం కరోనావైరస్ కేసులతో అల్లాడుతోంది. ముఖ్యంగా బుధవారపేటలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో దాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. బుధవార పేటలోనే మెడికల్ కాలేజీ కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ రెడ్ జోన్లలో పర్యటించి సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. దీంతో ఆయన ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోమ్ ఐసొలేషన్లోకి వెళ్లిపోయినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం రాసుకొచ్చింది. కలెక్టర్ క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతో పలువురు ప్రజాప్రతినిధులు షాక్కు గురయ్యారని తెలుస్తోంది. కరోనావైరస్ పై పోరులో భాగంగా పలువురు జిల్లా రాజకీయనాయకులు కలెక్టర్ వీరపాండ్యన్ను కలిసి మాట్లాడటం జరిగిందని ఇప్పుడు వారిలో కొత్త అనుమానాలు రేకెత్తినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.
కలెక్టర్ను కలిసిన పలువురు మంత్రులు
ఇక కర్నూలు మున్సిపల్ కమిషనర్గా రిలీవ్ అయిన రవీంద్రబాబుకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆయన కోవిడ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్తో కలిసి ఆయన చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కలెక్టర్ వీరపాండ్యన్కు పాజిటివ్ వచ్చిందా రాలేదా అనేదానిపై మాత్రం స్పష్టత లేదని ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలు కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వచ్చి జిల్లాలో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు ఆ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాదు నంద్యాల, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా వారు సమావేశం నిర్వహించినట్లు కథనం ప్రచురించింది. కర్నూలు నంద్యాల పట్టణాల్లో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
కలెక్టర్ కాంప్లెక్స్ను ఖాళీ చేయించాలని ఆదేశం..?
జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్తో తాను కలిశానని జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పారు. వెంటనే తాను వైరస్ టెస్టులు చేయించుకుంటానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రత్యేక అధికారి అజయ్ జైన్, ఐఏఎస్ అధికారులు హరిణినారాయణ, శ్రీనివాసులు కూడా కలెక్టర్ టీమ్లో ఉన్నారు. ఇక మొత్తం కలెక్టర్ కార్యాలయాన్ని ఖాళీ చేయించి జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు కలెక్టర్ వీరపాండ్యన్తో సమావేశాలు, సమీక్షలు దగ్గరగా వచ్చి మాట్లాడినవారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video