పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటన: విద్యార్థుల భారీ నిరసన, ఉద్రిక్తత, అరెస్ట్
కర్నూలు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన పర్యటనను అడ్డుకుంటామంటూ రాయలసీమ విద్యార్థి జేఏసీ పిలుపునివ్వడంతో భారీ ఎత్తున విద్యార్థులు కర్నూలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సీమ ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జేఏసీ నాయకులను, విద్యార్థులను అరెస్ట్ చేశారు. హత్యాచార బాధితురాలు సుగాలి ప్రీతికి న్యాయం కోసం పవన్ కళ్యాణ్ కర్నూలులో బుధవారం మధ్యాహ్నం కవాతు ప్రదర్శన చేపట్టారు. ఇందుకోసం ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే, రాయలసీమ ప్రజలను అవమానించారంటూ విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులంటూ వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్.. క్షమాపణలు చెప్పిన తర్వాత రాయలసీమలో అడుగుపెట్టాలంటూ డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శిస్తే తమకు అభ్యంతరం లేదని, కవాతులు నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కర్నూలు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు భారీ కవాతు నిర్వహించనున్నారు. హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆయన ఈ ప్రదర్శన చేపట్టారు. 2017లో కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి, హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, పోస్టుమార్టంలో అత్యాచారం జరిగిందని తేలింది.
Recommended Video
సదరు స్కూల్ అధినేత కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు ప్రీతిని అత్యాచారం, చేసి హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది ఇలావుంటే పవన్ పర్యటనకు ముందే జగన్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గత కొద్దిరోజుల క్రితం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications