Pic talk:చిన్నపిల్లాడిలా మారిన గంధం చంద్రుడు..కుమారుడి విజయం చూసి సగర్వంగా..!!
"పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు,
జనులా పుత్రుని కనుగొని పొగడగ ,
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.."
ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న సుమతీ శతకం శతాబ్దాలు మారినా చెక్కు చెదరనిది. ప్రతి తండ్రీ.. ఎప్పుడో ఓ సమయంలో దీన్ని స్వయంగా అనుభవించి ఉంటాడు. కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడిని గుర్తించి మెచ్చిన రోజునే నిజమైన సంతోషం కలుగుతుందనే ఈ సుమతీ శతకం భావం.. ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడికి వందశాతం వర్తిస్తుంది.
పట్టుమని పదేళ్లు కూడా లేని తన కుమారుడు ప్రపంచం మెచ్చేలా సాధించిన విజయాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు. రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరారోహణను దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఎనిమిదేళ్ల తన కుమారుడిని ఎత్తుకుని.. తాను చిన్నపిల్లాడిలా మారిపోయారు ఆ ఏపీ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్. అత్యంత కఠిన పరిస్థితులు, సంక్లిష్ట వాతావరణం మధ్య- రష్యాలోని ఆ అత్యున్నత పర్వత శిఖరాన్ని అధిరోహించడం అంటే మాటలు కాదు.

అలాంటి సాహస కార్యాన్ని ఎనిమిదేళ్ల వయస్సులోనే విజయవంతంగా ముగించాడు గంధం భువన్ జయ్. తన డెడ్లీ అడ్వెంచర్ ట్రిప్ను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నాడా మూడో తరగతి విద్యార్థి. ఈ సందర్భంగా విమానాశ్రయంలో తన కుమారుడికి ఘన స్వాగతం పలికారు గంధం చంద్రుడు. చిన్నపిల్లాడిలా భావోద్వేగానికి గురయ్యారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన అనంతరం నిర్వాహకులు ఇచ్చిన సర్టిఫికెట్ను అందుకున్నారు.
Welcome back Master #GandhamBhuvanJai. You have proved to the world that anything is possible with grit and determination and proper opportunity.
— Gandham Chandrudu IAS (@ChandruduIAS) September 24, 2021
Proud of you. pic.twitter.com/512uf2EDGp
గంధం భువన్ జయ్.. మూడో తరగతి విద్యార్థి. క్రీడలు, పర్వతాల అధిరోహణ పట్ల చిన్నప్పటి నుంచే అతనిలో ఆసక్తి ఏర్పడింది. దీన్ని గమనించిన గంధం చంద్రుడు తన కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. అనంతపురం జిల్లా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించాడు. అనంతరం కడప జిల్లా గండికోటలో ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్లో చేర్పించారు. సాంకేతికంగా మెళకువలను ఇప్పించారు. కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకుని పర్వతాలను అధిరోహించడానికి శారీరక దృఢత్వమే కాదు..మానసిక బలం అత్యవసరం.
ఎనిమిదేళ్ల చిరు ప్రాయంలో- అలాంటి ఆత్మ విశ్వాసాన్ని, మానిసక బలాన్ని సొంతం చేసుకున్నాడు భువన్. ఎనిమిదేళ్ల వయస్సులోనే అత్యున్నత పర్వత శిఖరాలను అధిరోహించడాన్ని అలవాటుగా మార్చకున్నాడు. ఇదివరకు లఢక్లో అతి ఎత్తయిన ఖర్దుంగ్ లా శిఖరాన్ని అధిరోహించాడు. మరోసారి అలాంటి సాహస కృత్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. యూరప్లో అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించాడు. ఈ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఈ నెల 18వ తేదీన భువన్ జయ్ ఈ రికార్డు నెలకొల్పాడు.

రష్యాలో ఉంటుందీ మౌంట్ ఎల్బ్రస్. ఐరోపా ఖండంలో ఉన్న ఏడు అతిపెద్ద శిఖరాగ్రాల్లో ఇదీ ఒకటి. దీని ఎత్తు 5,642 మీటర్లు. ప్రతి నిమిషం అక్కడి వాతావరణం మారుతుంటుంది. అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది దీని శిఖరాగ్రం. మైనస్లో ఉంటుంది అక్కడి టెంపరేచర్. అలాంటి శిఖరం.. అగ్రభాగాన్ని అందుకోవాలంటే సాహసమే. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. దానికి మించిన ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. క్షణక్షణానికి మారిపోయే వాతావరణానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ మౌంట్ ఎల్బ్రస్ను విజయవంతంగా అధిరోహించాడు గంధం భువన్ జయ్.
విశాఖపట్నానికి చెందిన భూపతి రాజు వర్మ, బెంగళూరుకు చెందిన నవీన్ మల్లేష్తో కలిసిన టీమ్తో గంధం భువన్ జయ్ తన రష్యా ప్రయాణాన్ని ఆరంభించాడు. ఈ నెల 11వ తేదీన రష్యాకు బయలుదేరి వెళ్లారు. అనంతరం టెర్స్కాల్లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్ క్యాంప్ను చేరుకున్నాడు. 13వ తేదీన 3,500 మీటర్లు, 15న 4,300 మీటర్లు, 18వ తేదీన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని అందుకున్నాడు. 19వ తేదీన మళ్లీ టెర్స్కాల్ బేస్క్యాంప్కు చేరుకున్నాడు. తన టీమ్తో కలిసి గంధం భువన్ జయ్ స్వదేశానికి చేరుకున్నాడు.












Click it and Unblock the Notifications