సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: ‘యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్కు గుర్తురాలేదు’
కర్నూలు: పాఠశాలకు వెళ్లిన 14ఏళ్ల బిడ్డ.. ఉరివేసుకుని చనిపోయిందని చెబితే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆయన కర్నూలులో అత్యాచారం, హత్యకు గురైన సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ భారీ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

సరదా కోసం కవాతులు చేయను..
సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి తల్లి తమ పార్టీ ఆఫీసుకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించారని చెప్పారు. సామూహిక అత్యాచారం, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రీతి తల్లి తెలిపిందని చెప్పారు. తాను సరదా కోసం ర్యాలీలు, కవాతులు చేపట్టనని.. ప్రీతికి న్యాయం కోసమే తాను కర్నూలుకు వచ్చానని తెలిపారు.

దిశకు ముందే.. ప్రీతి ఘటన..
దిశ ఘటన కంటే ముందే 2017లో సుగాలి ప్రీతి దారుణం జరిగిందని.. పాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దిశ ఘటనపై స్పందించిన సీఎం జగన్.. కర్నూలులో జరిగిన ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

పవన్ ఒక్కరే స్పందించారు..
ఈ సందర్భంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతిదేవి మాట్లాడుతూ.. తాను తన కూతుకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు అందరినీ కలిశానని, కానీ ఎవరూ న్యాయం చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే స్పందించారన్నారు. ఆయనకు రుణపడి ఉంటామని చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు కుంటుకుంటూ పోయి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్కూల్కు వెళితే రేప్ చేసి హత్య చేశారు.. ఆత్మహత్యగా..
2017లో 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతిని రేప్ చేసి, హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని వాపోయారు. అప్పటి ప్రభుత్వం నిందితులకు అండగా నిలిచిందని, ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయడం లేదని అన్నారు. పాత డీజీపీకి కలిసినా ప్రయోజనం లేదని అన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ప్రీతిపై అత్యాచారం జరిగినట్లు తేలిందని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు డబ్బులు తీసుకుని కేసును తప్పుదోవపట్టించారని ఆరోపించారు.
చివరకు తాను గత అక్టోబర్లో పవన్ కళ్యాన్ను కలిసి ఈ దారుణంపై చెప్పానని తెలిపారు. తన కూతురు తెలివైనదని సుగాలి ప్రీతి తల్లి చెప్పారు. రాజు నాయక్-పార్వతీల కూతురుగా ఎంతో పేరు తెస్తుందని అనుకుంటే.. ఇలా దారుణంగా చంపేశారని కన్నీటిపర్యంతమయ్యారు.

యూ చీప్ పీపుల్ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..
తాను జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదని.. న్యాం చేయాలని కోరుతున్నానని చెప్పారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సుగాలి ప్రీతి ఫైల్ ఇచ్చానని తెలిపారు. మొదటిసారి వెళ్లినప్పుడు బాగానే మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. రెండోసారి వెళితే.. యూ చీప్ పీపుల్ అంటూ తిట్టారని ప్రీతి తల్లి వాపోయారు.
2017లో జరిగింది కాదా? ఇప్పటి వరకు మీరేమైనా నిద్రపోతున్నారా? అని మంత్రి దుయ్యబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క రాష్ట్రంలో దిశ గుర్తుంది.. ప్రీతిని ఎందుకు మర్చిపోయారు జగన్..
పక్క రాష్ట్రంలో జరిగిన ఘటనతో అసెంబ్లీలో దిశ చట్టం చేశారని.. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన కూతురు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. స్కూల్ యాజమాన్యం గత ప్రభుత్వానికి భారీగా డబ్బు ముట్టజెప్పిందని, తనకు కూడా కోటి రూపాయలు ఇస్తామని చెప్పారని తెలిపింది. కోటి కోసం తన కూతురు మాన, ప్రాణాలను అమ్ముకోలేదని ఆమె చెప్పారు. దీంతో తమ ఇంటిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడ్డారని, తన రెండు కాళ్లను విరగ్గొట్టారని వాపోయారు. హోంమంత్రి సుచరితను కలవాలని ప్రయత్నించినా.. ఆమె కలవలేదని చెప్పారు. తన కూతురుకు న్యాయం చేయాలని పోరాడుతున్న పవన్ కళ్యాణ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications