తుపాకీ తీసుకొని గాల్లోకి కాల్పులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై విమర్శలు
యావత్ దేశం పంద్రాగస్ట్ వేడుకల కోసం ఎదురుచూస్తోంది. ర్యాలీలు తీస్తూ.. దేశభక్తిని చాటుతోంది. కొన్ని చోట్ల నేతలు, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అయితే కాంట్రవర్సీ కూడా అవుతుంది. అవును సాక్షాత్ మంత్రే తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నెటిజన్లు తప్పుపడుతున్నారు.
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్నారు. జనం చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నా... ఆయనను వారించలేదు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారని కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video
బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి 75 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్ర్యం లభించిన సంగతి తెలిసిందే. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి ఆజాదీ లభించింది. ఏటా ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని పురష్కరించుకొని జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నాం. దేశంలో ఈ రెండు పండుగలు అంతా వేడుకగా జరుపుకుంటారు. వీటితోపాటు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని కూడా ఘనంగా జరుపుకుంటారు.