షాకింగ్ : మెదక్లో మహిళపై యాసిడ్ దాడి.. మహిళా దినోత్సవం రోజే దారుణం...
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో ఓ మహిళ(45)పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం.యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమించినట్లు తెలుస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బాధితురాలిని టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండా వాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే టేక్మాల్ మండలానికి చెందిన ఆమె గడిపెద్దాపూర్కి ఎందుకు వచ్చిందన్నది తెలియాల్సి ఉందన్నారు.
ఆదివారం(మార్చి 7) జోగిపేట సంతకు వెళ్లిన ఆమె అక్కడినుంచి ఓ వ్యక్తితో కలిసి గడిపెద్దాపూర్ వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. దాడి జరిగిన సమయంలో బాధితురాలు తనను కాపాడాలంటూ ప్రతీ ఇంటి తలుపు తట్టినట్లు వారు చెప్తున్నారు. ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో మాట్లాడలేని స్థితిలో బాధితురాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.