కాంగ్రెస్ సర్కార్ రాబోతోంది.. కేసీఆర్ పని ఇక ఖతమే..?: ఉత్తమ్కుమార్
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు. కొట్లాటలు, కుమ్ములాటలతో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం విశ్వాసంతో ఉన్నారు. పీసీసీ చీఫ్ గురించి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. తొగుట మండలం తుక్కాపూర్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డితో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి ఆవిష్కరించారు.
ఆదర్శ రైతు, నేత..
చెరుకు ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కాబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. సీఎం కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
సంగతి చూస్తాం..
సిద్దిపేట జిల్లా కలెక్టర్ తీరు బాగోలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కలెక్టర్ వెంకటరామిరెడ్డి సంగతి చూస్తామన్నారు ప్రతి గ్రామంలో ప్రతీ గింజ కొనాల్సిందేనని ఉత్తమ్ స్పస్టంచేశారు. లేదంటే పోరుబాట పడతామని చెప్పారు. జనవరి 11న ప్రతి జిల్లాలో కొనుగోలు కేంద్రాల విషయంలో నిరసన చేపడుతామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో వణుకుతూ రైతులు నిరసన తెలిపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం లేదని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
సస్పెన్స్ కంటిన్యూ..
టీ పీసీసీ రేవంత్ రెడ్డికి ఖాయమే కానీ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు ఇతరుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని సమాచారం. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ ఇవ్వడంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీని బలంగా ఎదుర్కొగలదని కొందరు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డికి దాదాపుగా టీపీసీసీ చీఫ్ పదవీ ఖాయం అని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, ఓ వర్గం వ్యతిరేకతతో ఆలస్యమవుతోంది.