ఇప్పుడు వాసాలమర్రి వంతు.. దళితబంధు నగదు జమ, ఫోన్లకు మేసెజ్
దళిత బంధు నిధులు మంజూరు అవుతున్నాయి. మొన్న హుజురాబాద్లో లబ్దిదారులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి వంతు వచ్చింది. దళిత బంధు డబ్బులు దళితుల ఖాతాల్లో జమ కావడంతో.. ఆ బిడ్డల సంతోషం ఉప్పొంగుతోంది. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
సీఎం సీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి దళిత వాడల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల నగదు జమ అయింది. గురువారం ఉదయం నుంచి వారి సెల్ఫోన్లకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్లు వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తమ కాళ్ళ మీద తాము నిలబడేలా పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ తదితర యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఆయా యూనిట్లపై అవగాహన కల్పించేందుకు అధికారులు గురువారం లబ్ధిదారులను బస్సులో క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకెళ్లారు.
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. కానీ దళితబంధు నిధులు మాత్రం మంజూరు అవుతూనే ఉన్నాయి.