మునుగోడులో కాల్పుల కలకలం: కోమటిరెడ్డి స్వగ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు..!
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మునుగోడులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాల్పుల ఉదంతం వెనుక రాజకీయ కోణం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పోలీసులు దీన్ని తోసిపుచ్చారు.
మునుగోడు మండలం ఊకొండి సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. బైక్పై వెళ్తోన్న నిమ్మల లింగస్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్ల పాటు బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే ఊకొండి గ్రామ సర్పంచ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
నిమ్మల లింగస్వామి స్వస్థలం.. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వస్థలం కూడా ఇదే. మునుగోడులో వాటర్ ప్లాంట్ను నిర్వహిస్తోన్నాడు. ఇదివరకు రెంటల్ సర్వీస్ కింద ఓ వాహనాన్ని నడిపించాడు. అందులో నష్టం రావడంతో వాటర్ ప్లాంటు నిర్వహిస్తోన్నాడు. రోజూ బ్రాహ్మణవెల్లంల నుంచి మునుగోడు మండల కేంద్రానికి బైక్పై రాకపోకలు సాగిస్తోన్నాడు.
రాత్రి మునుగోడు నుంచి బైక్పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఊకొండి క్రాస్ రోడ్ వద్దకు రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. బుల్లెట్పై వచ్చిన వారు వెనుక నుంచి కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లింగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు.
ఊకొండి సర్పంచ్ వెంటనే క్షతగాత్రుడిని నార్కట్పల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై దర్యాప్తు సాగిస్తోన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామానికి చెందిన వ్యక్తిపై కాల్పులు చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.