నల్గొండ జిల్లాలో వర్షం మిగిల్చిన విషాదం.. ఇంటిగోడ కూలి నిద్రిస్తున్న తల్లీకూతుళ్ళు దుర్మరణం
నల్గొండ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నల్గొండ జిల్లాలో ఇద్దరు మరణించిన ఘటన స్థానికంగా ఉన్నవారిని ఆవేదనకు గురి చేసింది. ఇద్దరూ తల్లీకూతుళ్లు కావటంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక నల్గొండ జిల్లాలోనూ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో నల్లగొండ పట్టణంలోని పద్మ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తమ ఇంటి గోడకూలి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కూతురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పద్మా నగర్ కు చెందిన నడికుడి లక్ష్మి ఆమె కుమార్తె కళ్యాణి గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటి గోడ కూలి పడిపోయింది.
ఇక ఇంట్లో ఉన్న బీరువా వారిపై పడింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. కళ్యాణికి ఇటీవలే వివాహమైంది అని, కొత్తగా పెళ్లి చేసుకున్న కళ్యాణి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. లక్ష్మి కుటుంబం కొన్నేళ్లక్రితం శ్రీకాకుళం జిల్లా నుండి నల్గొండకు వలస వచ్చిందని, రైల్వే కూలీలకు వంట చేస్తూ వారి జీవనం సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు గోడ కూలిన శిధిలాలలో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాగా వర్షానికి తడిసిన గోడ నానిపోయి కూలిపోవటంతో ప్రమాదం జరిగిందని, నిద్రలోనే తల్లీ కూతుళ్ళు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. వర్షాకాలం కావడంతో బాగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకూ అటువంటి ఇళ్లలోనే ఉండకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. సురక్షితమైన ఇళ్ళలోకి మారాలని చెప్తున్నారు. ప్రాణాలు చాలా విలువైనవని, వర్షాకాలంలో అజాగ్రత్త మంచిది కాదని సలహా ఇస్తున్నారు.