జానారెడ్డి అడ్రస్ గల్లంతు అవుతోంది.. భగత్ విజయం ఖాయం, మంత్రి తలసాని
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో రాజకీయ పార్టీల ప్రచారం పీక్కి చేరింది. అధికార టీఆర్ఎస్ తరఫున నోముల భగత్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. హాలియాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తలసాని మాట్లాడారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విపక్షాల అడ్రస్ గల్లంతవడం ఖాయమని మంత్రి తలసాని అన్నారు. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని పేర్కొన్నారు. సాగర్లో నోముల భగత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సాగర్ బరిలో విపక్షాలకు పుట్టగతులు ఉండవని చెప్పారు.
ఏడుసార్లు గెలిచిన జానారెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను మాత్రమే ఎదిగారని మంత్రి తలసాని ఫైరయ్యారు. ప్రజల బాగోగులు పట్టించుకోలేరని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పేరును ప్రకటించిన వెంటనే పోటీ నుంచి తప్పుకుని ఉంటే జానారెడ్డి పట్ల ఎంతో గౌరవం కలిగేదని తెలిపారు. భగత్ కొట్టే దెబ్బకు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి శాశ్వతంగా మర్చిపోతాడని తలసాని కామెంట్ చేశారు.
సాగర్ ప్రచారం హీటెక్కుతోంది. టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఉప ఎన్నికకు ఈ రెండు పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విజయం సాధించాలని అనుకుంటున్నాయి. ప్రజలకు హామీలు ఇస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యాయి.