విజయశాంతికి భలే ఛాన్స్: సాగర్ ఉప ఎన్నిక కోసం స్టార్ క్యాంపెయినర్లు వీరే: లిస్ట్ పెద్దదే
నల్లగొండ: తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించనున్న ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ప్రిస్టేజియస్గా తీసుకుంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లల్లో కనిపించిన దూకుడును ఇక్కా ప్రదర్శించడానికి సమాయాత్తమౌతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించుకునే ప్రయత్నంలో పడింది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సాగర్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా శాసన మండలి ఎన్నికల్లో ఎదురైన పరాజయ భారాన్ని దించుకోవాలని నిర్ణయించుకుంది.

30 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్..
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ప్రకటించారు. ఏకంగా 30 మందికి ఈ జాబితాలో చోటు కల్పించారు.. దీన్ని బట్టి చూస్తే.. సాగర్ ఉప ఎన్నికను బీజేపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే కాషాయ కండువాను కప్పుకొన్న నాయకులకూ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీమంత్రులతో ఈ జాబితా నిండిపోయింది. వారంతా దశలవారీగా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

లిస్ట్ ఇదే..
ఈ జాబితాలో- బండి సంజయ్, డీకే అరుణ, జీ కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, పీ మురళీధర్ రావు, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, టీ రాజాసింగ్, ఎం రఘునందన్ రావు, ఎన్ రామచందర్ రావు, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, వివేక్, విజయశాంతి, చాడా సురేష్ రెడ్డి, డీ రవీంద్ర నాయక్, డాక్టర్ విజయ రామారావు, చింతల రామచంద్రా రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు, లక్ష్మీనారాయణ, మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి, బాబూ మోహన్, చంద్రశేఖర్, మంత్రి శ్రీనివాసులు, స్వామిగౌడ్, ఎం ధర్మారావు, ఎం విజయ్పాల్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు.

అభ్యర్థిని డిక్లేర్ చేయకముందే..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై బీజేపీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి జానారెడ్డి పోటీ ఖాయం కావడంతో ఇక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై అందరి దృష్టి నిలిచింది. గెలుపు గుర్రం కోసం ఈ రెండు పార్టీలు అన్వేషిస్తున్నాయి. కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్, నివేదితా రెడ్డి పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. నివేదితా రెడ్డి ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేయడం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఉత్కంఠభరితంగా మార్చింది. మరొకరి పేరును బీజేపీ ప్రకటిస్తే.. నివేదితా రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిల్చోవడం ఖాయమౌతుంది.

దుబ్బాక ఫలితమే..
సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక ఫలితాలను ఇక్కడ పునరావృతం చేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ పట్టభద్ర నియోజకవర్గాల్లో ఎదురైన ఓటమి బీజేపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ రెండింటి ఓటమిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థిని ఎంపిక చేయడంతోనే సగం విజయం సాధించాలని భావిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నారు. పేర్లను వడపోస్తున్నారు.












Click it and Unblock the Notifications