తెలంగాణ పొలిటికల్ సెమీ ఫైనల్ - మునుగోడులో పోలింగ్ ప్రారంభం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పోరు మొదలైంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు బై పోల్ పోలింగ్ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నుంచి ఈ సమయం వరకు ఇక్కడ గెలుపును అభ్యర్ధులు..ఆ పార్టీల అధినాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నిక ప్రచారం హోరా హోరీగా నిర్వహించారు. ఇక, ఇప్పుడే ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఈ ఉప ఎన్నికలో 47 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,855 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వీరి కోసం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. రాజకీయ పార్టీల పరస్పర ఫిర్యాదులతో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. 199 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. పోలింగ్ సిబ్బంది: 1,492 మంది ని నియమించగా, అయిదు వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 50 టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించారు. అర్బన్ పరిధిలో 35, రూరల్ పరిధిలో 263 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులను మంజూరుచేశారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని, ఇంకా అందనివారు ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసారు. నియోజవకర్గంలో 50 మంది సర్వీసు ఓటర్లు, 2576 మంది 80 ఏళ్లు దాటినవారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మందికిగాను 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర రెడ్డి, కాంగ్రెస్ నుంచి స్రవంతి ప్రధాన అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మూడు పార్టీలు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇక, ఈ ఎన్నిక తరువాత అసెంబ్లీ ఎన్నికల దిశగా తెలంగాణ రాజకీయాలు కేంద్రీకరించనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ప్రకటన చేసిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావటంతో కీలకంగా మారింది. అదే విధంగా తెలంగాణలో ఉప ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న బీజేపీకి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం సాధించే క్రమంలో కాంగ్రెస్ సిట్టింగ్ కావటంతో, మునుగోడు ఉప ఎన్నిక సవాల్ గా మారింది. దీంతో, పొలిటికల్ హై ఓల్టేజ్ మధ్య ఈ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.