నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... బైక్-టిప్పర్ ఢీ... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్,టిప్పర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతులను అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదే నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జనవరిలో పీఏ పల్లి మండలం అంగడిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ఆటో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా... 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఆటోలో ప్రయాణిస్తున్నవారిని సుద్దబావి తండాకు చెందినవారిగా గుర్తించారు. వీరు వరినాట్ల నిమిత్తం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఓ బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నారు. ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను కేసీఆర్ ఆదేశించారు.