టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?
నల్గొండ : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్.. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్లోనూ చక్రం తిప్పుతోంది. మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేల వారీగా బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. అదలావుంటే స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచిస్తున్నారు.
రెడ్డి అభ్యర్థులతో ఎమ్మెల్సీ బరిలోకి టీఆర్ఎస్.. కేటీఆర్ జోక్యంతో మాజీ స్పీకర్కు మొండిచేయి..?
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ రానురాను ఢీలా పడుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల వేళ జోష్ పెంచాలని చూసినా కుదరలేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
జడ్పీ పీఠంపై గురి.. బిగ్ ఫైట్
నల్గొండ జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటోంది కాంగ్రెస్ పార్టీ. గులాబీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక ధోరణితో ముందుకెళుతున్నారు. స్థానికంగా ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ జడ్పీ పీఠంపై గురిపెట్టారు. అవసరమైతే కొన్నిచోట్ల ఎంపీటీసీ స్థానాలను ఇతరులకు వదిలేస్తూ.. జడ్పీటీసీ స్థానాలు మాత్రం తమ ఖాతాలో పడేలా కసరత్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో 31 జడ్పీ స్థానాలున్నాయి. జడ్పీ ఛైర్మన్ కుర్చీ సొంతం కావాలంటే పదహారు స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ఆ మేరకు అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరు పార్టీల నేతలు అవసరం మేరకు స్థానికంగా టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ పార్టీలతో అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్ వ్యూహం..!
నల్గొండ జడ్పీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దనే రీతిలో టీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది. అందులోభాగంగా పార్టీ సీనియర్ నేత బండా నరేందర్ రెడ్డిని జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి నార్కట్పల్లి స్థానం నుంచి టికెట్ కేటాయించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డి గెలుపు బాధ్యతను జిల్లా నాయకత్వం భుజాలకెత్తుకుంది. ఆరు నూరైనా ఆయనను గెలిపించి తీరుతామనే శపథం చేస్తున్నారు జిల్లా టీఆర్ఎస్ నేతలు. ఆ క్రమంలో ఇప్పటికే ఓ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నల్గొండ ఎమ్మెల్యే తదితర ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహించారు.
జడ్పీటీసీల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదే..!
నల్గొండ జడ్పీ ఛైర్మన్ కుర్చీని ఎలాగైనా సొంతం చేసుకోవాలనేది టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన. ఆ మేరకు జడ్పీటీసీలను గెలిపించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను నాలుగు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. నకిరేకల్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం ఐదుకు చేరింది. ఇక కాంగ్రెస్ కు మిగిలింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే. అయితే జిల్లాలో అత్యధికంగా ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో.. జడ్పీటీసీ స్థానాలను మాగ్జిమమ్ గెలవాలన్నది హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ కన్ను కూడా..!
నల్గొండ జడ్పీ ఛైర్మన్ కుర్చీ కోసం టీఆర్ఎస్ నేతలు ఎంతలా ఆరాటపడుతున్నారో.. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పేరును హైకమాండ్ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులను పక్కన పెట్టకుండా వారికి మరో అవకాశం ఇస్తూ ఎంపీటీసీ టికెట్లు కేటాయించారు. తద్వారా వారి నుంచి జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. అలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
సోదరుడి కోసం..!
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరుడైన మోహన్ రెడ్డి జడ్పీ ఛైర్మన్ బరిలో నిలవడంతో వారిద్దరు కూడా ఆయన విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న నార్కట్ పల్లి స్థానానికే ప్రచారం పరిమితం చేయకుండా.. జిల్లాలో అత్యధిక జడ్పీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేస్తున్నారు. సోదరుడు ఛైర్మన్ గా గెలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా జడ్పీటీసీ స్థానాల్లో గెలవాల్సిన క్రమంలో వారిద్దరూ కూడా చెమటోడుస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిగా సాగుతున్న జడ్పీ పోరు జిల్లాలో ఆసక్తికరంగా మారింది.