సీఎంను తీసివేయాలి.. అప్పుడే బతుకులు బాగుపడతాయి: వైఎస్ షర్మిల
డిండీ ప్రాజెక్టు కింద భూములు పోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 17వ రోజు మర్రిగూడ మండలంలోని దామెరభీములపల్లి గ్రామంలో కొనసాగింది. మర్రిగూడలో ప్రజలతో వైయస్ షర్మిల గారు డిండీ ప్రాజెక్టుపై మాట్లాడారు. అలాగే కరోనా బిల్లులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇంట్లో ఎంత మంది వృద్ధులు ఉన్నా అందరికీ పింఛన్ ఇస్తామని హామీనిచ్చారు.
సీఎంను తీసివేస్తే..
ప్రభుత్వ అధికారులకు చెబితే సమస్యలు తీరవన్నారు. సీఎంను తీసేస్తేనే బతుకులు బాగుపడతాయని వివరించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు తీసుకువచ్చారు. పత్తి విత్తనాల ధరను 1300 నుంచి 600 రూపాయలకు తీసుకువచ్చారు. వ్యవసాయాన్ని పండుగ చేశారు. వైఎస్ఆర్ రైతులకు సబ్సీడీ కింద యంత్రాలను ఇచ్చారు. మహిళలకు రుణాలు ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేశారు. ఎన్నో ఉద్యోగాలు సృష్టించారు. పేదవాడికి జబ్బోస్తే ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు.
పక్కా ఇళ్లు
వైఎస్ఆర్ పేదల కోసం 46 లక్షల పక్కా ఇళ్లు కట్టారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న ఏ చార్జీలు కూడా పెంచలేదు. అద్బుతంగా పాలన చేసిన రికార్డు నెలకొల్పారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు కూలీ పనులు చేసుకుంటున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన యువతను నిరుద్యోగులుగా మార్చేందుకేనా కేసీఆర్ ను సీఎంగా చేసుకుంది..? అని అడిగారు. వైఎస్ హయాంలో నల్గొండ జిల్లాకు ఆరోజుల్లో 30 సార్లు వచ్చారు. ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారు..? రోడ్లు, మోరీలు బాగోలేవంటే వాటికి కారణం కేసీఆర్ కాదా..?
గడీలలో
ప్రగతీభవన్లో, గడీలల్లో వారి బాత్ రూంలకు బులెట్ ప్రూఫ్ ఉందట..అంటే వారి ప్రాణాలకు విలువ ఉంది. ప్రజల ప్రాణాలకు విలువ లేదా..? ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా ఎవరికీ పట్టనట్టుగా పాలకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంత మంది మిగిలారు. టీఆర్ఎస్కు అమ్ముడు పోలేదా..? అని అడిగారు. ప్రతిపక్షం గానీ, పాలక పక్షం గానీ ప్రజల గురించి ఆలోచన చేస్తోందా..? అని అడిగారు. గాడిదకు రంగుపూసి ఇదే ఆవు అని కేసీఆర్ నమ్మించగలడు అని చెప్పారు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ విద్య, రైతులకు రుణమాఫీ ఇలా ఎన్నో హామీలు చెప్పి ఒక్క హామీనైనా నెరవేర్చారా..? అని అడిగారు.
Recommended Video
బై పోల్
ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే అప్పుడు మాత్రమే సీఎంగా బయటకు వచ్చారు. అప్పుడు మాత్రమే హామీలు ఆ ప్రాంతంలో అమలు అవుతాయి. ఎన్నికలు అయిపోగానే ఆ పథకం కనిపించదు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం కేసీఆర్కు లేదా..? అని అడిగారు. ప్రజల కోసమే తమ పార్టీ పుట్టింది అన్నారు. ఏ స్వార్థం లేకుండా నాన్నలా సేవ చేసేందుకే పార్టీ స్థాపించారని తెలిపారు. తను తెలంగాణలో చదువుకున్నా, ఇక్కడే బతికా, ఈ గాలి పీల్చా, ఈ నీళ్లే తాగా, ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే కొడుకు, కూతురును కన్నా అలాంటప్పుడు నా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకోవడం తప్పా..? అని అడిగారు. తమ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పుట్టిందని వివరించారు. వైఎస్ఆర్ చనిపోయే వరకు ప్రజలకు సేవ చేశారని తెలిపారు.