మంత్రులే అవినీతి చేస్తే ప్రజలకేం న్యాయం చేస్తారు : ప్రశ్నించిన భూమా అఖిల ప్రియ
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి టిడిపి నేతలపై దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న దృష్టి రైతుల మీద లేదని అఖిల ప్రియ మండిపడ్డారు. వైసీపీ మంత్రుల తీరుపై విరుచుకుపడ్డారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి కరెంటు మీటర్ లు ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. వరదల వల్ల రైతులు పంట నష్టపోయినా వారికి నష్టపరిహారం ఇవ్వడానికి వైసిపి ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. రైతులను జగన్ సర్కార్ మోసం చేస్తుందని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. గత వరదల సమయంలో నంద్యాలకు వచ్చి రైతులను ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు రైతులను ఏ విధంగానూ ఆదుకోలేదంటూ పేర్కొన్నారు భూమా అఖిలప్రియ.
రైతులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేదిలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంటే, ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తుందని, రైతులకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు అఖిలప్రియ. వైయస్సార్ జలకళ పథకం ద్వారా వేసే ఉచిత బోర్ల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని , గైడ్ లైన్స్ రాలేదని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.
ఇదే సమయంలో వైసిపి మంత్రి గుమ్మనూరు జయరాం పై విమర్శలు గుప్పించారు. మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతి అక్రమాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, ఆయనపై విచారణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు అఖిలప్రియ. మంత్రులే అవినీతికి పాల్పడితే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అంటూ నిలదీశారు. మంత్రి జయరాం పై విచారణ జరిపి కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.