జొన్నవాడ ఆలయ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్..అక్కడికక్కడే ఉద్యోగి తొలగింపు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామివారి ఆలయంలో చోటు చేసుకున్న ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సిబ్బందితో మాట్లాడారు. ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి కారణమైన ఉద్యోగిని తొలగించాలని అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు.

అసలు కారణమేంటీ..?
జిల్లాలోని బుచ్చి నాయుడు కండ్రిగ మండలం జొన్నవాడలో ఉందీ కామక్షమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఏపీ నుంచే కాకుండా తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. కార్తీకమాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకుని రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. భక్తి ప్రపత్తులతో కార్తీక దీపాలను వెలిగించారు. ఆ దీపాలు వెలుగుతున్న సమయంలోనే.. ఆలయ సిబ్బంది ఒకరు.. దురుసుగా ప్రవర్తించారు. నీళ్లతో దీపాలను ఆర్పివేశారు. పైపుతో నీటిని ధారాపాతంగా ప్రవహింపజేశారు.

ఆరా తీసిన ఎమ్మెల్యే..
భక్తుల సమక్షంలోనే ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. భక్తులు వారిస్తున్నప్పటికీ అతను వినిపించుకోలేదు. వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ల ద్వారా వీడియోలను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఉద్యోగి బండారం బట్టబయలైంది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే స్థానిక కోవూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు.

కార్తీక దీపాలను ఆర్పడమేంటీ..
కామాక్షి తాయి ఆలయానికి తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, అలాంటి ఆలయంలో ఉద్యోగులు సత్ప్రవర్తనను కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఉద్దేశపూరకంగా కార్తీక దీపాలను ఆర్పివేయడాన్ని చిన్న విషయంగా పరిగణించవద్దని సూచించారు. ఈ ఘటనకు కారణమైన ఉద్యోగిని తొలగించాలని ఆదేశించారు. అవసరమైతే తాను జిల్లా దేవాదాయ శాఖ అధికారితో మాట్లాడతానని అన్నారు.
Recommended Video

ఈఓ ఏం చేస్తున్నారు?
ఆలయ కార్యనిర్వహణాధికారి పనితీరుపైనా నల్లపురెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం పవిత్రమైన రోజు అని, అలాంటి సందర్భంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, అలాంటప్పుడు కూడా విధుల్లో లేకుండా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. భక్తుల రద్దీని నియంత్రించకుండా, కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఏం చేస్తున్నారో తెలుసుకోలేనంత తీరిక లేకుండా ఉన్నారా? అని నిలదీశారు. దీపాలను ఆర్పివేసిన ఉద్యోగిని వెంటనే జైల్లో వేయించాలనేంత కోపంగా ఉందని ఆయన చెప్పారు. ఉద్యోగి మందు కొట్టి ఆలయానికి వస్తోంటే.. ఈఓ ఏం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications