మురికి కాల్వలో బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే: అధికారుల పనితీరుపై ఫైర్
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో నిరసన తెలియజేశారు. మురుగునీటి కాల్వలో కూర్చున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ ఈ రకంగా ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదివరకు ఆయన ఇదే తరహాలో అధికారుల పనితీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వాటినే పునరావృతం చేశారు.
కొంతకాలంగా ఆయన తన నియోజకవర్గం పరిధిలో గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నారు. ప్రజలు ఎదుర్కొంటోన్న స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. గడప గడపకు ఎమ్మెల్యే సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్తోన్నారు. ఉమ్మారెడ్డి గుంటలో మురుగునీటి సమస్యపై స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులను పలుమార్లు అధికారులకు వివరించినప్పటికీ.. అది పరిష్కారానికి నోచుకోవట్లేదు.
దీనితో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉదయం ఉమ్మారెడ్డి గుంటకు వెళ్లి..మురుగునీటి కాల్వలో బైఠాయించారు. ఆందోళనకు దిగారు. అధికారులు వారించినప్పటికీ.. వినిపించుకోలేదు. ఆయన అనుచరులు, స్థానికులు, పార్టీ కార్యకర్తలు సంఘటనాస్థలానికి చేరుకోవడంతో ఉమ్మారెడ్డి గుంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు పరిష్కరిస్తారనేది అధికారులు లిఖితపూరకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మారెడ్డిగుంట మురుగునీటి కాల్వ సమస్యను పరిష్కరించాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తోన్నామని, అయినప్పటికీ అధికారులు ఏదో ఒక సాకుతో దాటవేస్తోన్నారంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందని, చాలాసార్లు ఈ విషయాన్ని వారికి వివరించినప్పటికీ.. ఫలితం ఉండట్లేదని అన్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు పడితే- మురుగు నీరు ఇళ్లల్లోకి ప్రవహిస్తుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
మురికి కాల్వలో బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే: అధికారుల పనితీరుపై ఫైర్ #YSRCP, #KotamreddySridharReddy pic.twitter.com/pKrK5naj8e
— oneindiatelugu (@oneindiatelugu) July 5, 2022