కోటంరెడ్డి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్- నెల్లూరులో కీలక నేతను దించనన్న జగన్..!!
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి- కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తాను ఏనాడూ పరుషంగా మాట్లాడ లేదని చెప్పారు.
నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఒకటి- ఉమ్మడి నెల్లూరు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్సీపీ. అన్ని నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది. ఏ ఒక్కదాంట్లోనూ ఓడిపోలేదు. వరుసగా రెండోసారి సునామీ సృష్టించింది. 2014లో తెలుగుదేశం-బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా వైసీపీకి పట్టం కట్టిందీ జిల్లా. అలాంటి చోట వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి, అసమ్మతి గళం వినిపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొన్న ఆనం..
మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు, తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి.. అధికార పార్టీపై తిరుగుబాటు బావుటా లేవదీశారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. బహిరంగంగానే. ప్రభుత్వ పెద్దలను విమర్శించారు. అధికార యంత్రాంగాన్నీ తప్పుపట్టారు. మంత్రి పదవి లభించకపోవడం వల్లే ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారనే విషయం బహిరంగ రహస్యమే.
అదే బాటలో కోటంరెడ్డి..
ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుస్తోన్నారు. కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోన్నారు. వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్ర ఉన్న ఆయన- జిల్లా అధికార యంత్రాంగంపై తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆయనను వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అసంతృప్తిని వ్యక్తం చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ చర్యలేవీ పెద్దగా ఫలించనట్టే.
వైసీపీ నుంచి పోటీ చేయనంటూ క్లారిటీ..
తనను అనుమానించిన, అవమానించిన పార్టీలో ఒక ఉండకూడదని నిర్ణయించుకున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని నేరుగా ఎవరికి చెప్పాలో.. వారికి చెప్పేస్తాననీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయకూడదని తన మనసు చెబుతోందని పేర్కొన్నారు. అందుకే బహిరంగంగా తాను మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. ప్రభుత్వానికి తాను ఎలాంటి చికాకులు తీసుకుని రాననీ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు..
ప్రభుత్వం తనపై నిఘా ఉంచిందని, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా ఆరోపించడం కలకం రేపింది. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనకు ఫోన్ చేశారని, రాజకీయ ప్రత్యర్థులతో ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పైనా ఆయన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ఆయన ప్రమేయం కూడా ఉందని విమర్శించారు.
సీరియస్ గా తీసుకున్న జగన్..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ.. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి తరహాలోనే కోటంరెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నెల్లూరు రాజకీయ పరిణామాలను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
ఆదాలకు ఛాన్స్..?
కోటంరెడ్డికి ప్రత్యామ్నాయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధి ఇన్ ఛార్జ్ బాధ్యతలను అప్పగించడానికి ఒకరిద్దరు నాయకుల పేర్లు జగన్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నెల్లూరు లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఆదాల పేరును దాదాపు ఖాయం చేస్తారని, ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు వెలువడొచ్చనీ చెబుతున్నారు.
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!