WTC Final: బద్ధకం వదులుకోవాల్సిందే: ఇంగ్లాండ్పై సిరీస్ కివీస్ వశం: కోహ్లీసేన అలర్ట్
లండన్: సరిగ్గా నాలుగు రోజుల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఆరంభం కాబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం ఈ నెల 18వ తేదీన ఇంగ్లాండ్ సౌథాంప్టన్లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. రెండు జట్లూ సన్నాహాక మ్యాచ్లను ఆడేశాయి. కోహ్లీసేన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ను ఆడగా.. దీనికి భిన్నంగా కివీస్- ప్రొఫెషనల్ టెస్ట్ సిరీస్ను విజయవంతంగా ముగించుకుంది. ఇంగ్లాండ్పై రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను తన వశం చేసుకుంది. టీమిండియాకు బిగ్ అలర్ట్ ఇచ్చింది.

ఎనిమిది వికెట్ల తేడాతో..
ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండ్ ప్రతిభను కనపరిచింది. బ్యాటింగ్, ఫీల్డింగ్లో అద్భుతంగా రాణించింది. రెండో ఇన్నింగ్లో ఇంగ్లాండ్ వంటి వరల్డ్క్లాస్ జట్టును 122 పరుగులకే కట్టడి చేసిన పడేసిన బ్లాక్ క్యాప్స్.. సునాయాస విజాయాన్ని అందుకున్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 42 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్లో ఇంగ్లాండ్ 303 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 388 రన్స్ చేసి, భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను 122 పరుగులకే ఆలౌట్ చేశారు. రెండు టెస్ట్ల సిరీస్ను 1-0తో గెలుచుకోగలిగారు.

1999 తరువాత..
ఒక టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశ జట్టును ఓడించడం న్యూజిలాండ్కు మొత్తంగా ఇది మూడోసారి. ఇదివరకు 1986, 1999లో మాత్రమే ఈ ఫీట్ను సాధించింది కివీస్. తాజాగా ముచ్చటగా మూడోసారి టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. రెండు ఇన్నింగ్లల్లో కలిపి ఆరు వికెట్లను పడగొట్టిన కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. గాయం వల్ల ఈ టెస్ట్ మ్యాచ్కు కేప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైనప్పటికీ.. ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇంగ్లాండ్ను కట్టి పడేయడానికి పక్కాగా ప్లాన్ను రూపొందించుకున్న కివీస్.. అంతే పక్కాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగింది.

బిగ్ బూస్ట్..
సరిగ్గా నాలుగు రోజుల్లో సౌథాంప్టన్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కాబోతోన్న ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్.. ఈ ఘన విజయాన్ని సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీసేనను ఢీ కొట్టబోతోందా జట్టు. ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్కు ముందు- టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్తో సరిపెట్టుకోగా.. న్యూజిలాండ్ మాత్రం ప్రొఫెషనల్ టెస్ట్ క్రికెట్ ఆడింది. అందులో ఘన విజయాన్ని సాధించి.. సవాల్ విసిరింది. ఈ మ్యాచ్లో సాధించిన విజయంతో.. బ్లాక్ క్యాప్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

కోహ్లీసేన అలర్ట్..
ఈ మ్యాచ్లో కివీస్ సాధించిన విజయంతో కోహ్లీ అండ్ టీమ్ ఉలిక్కి పడే ఉంటుంది. గెలుస్తామనే ధీమా ఏ మాత్రం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. బద్ధకాన్ని వదులుకోవాల్సి ఉందనే సందేశాన్ని న్యూజిలాండ్ పంపించినట్టయింది. నెట్ ప్రాక్టీస్లో మరింత చెమటోడ్చడంతో పాటు- ఫైనల్ మ్యాచ్ తుది జట్టు కూర్పులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది టీమిండియాకు. 12 సంవత్సరాల తరువాత ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశ జట్టును న్యూజిలాండ్ ఓడించిందంటే.. ఆ జట్టు శక్తి సామర్థ్యాలను ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. డబ్ల్యూటీసీ టైటిల్ను బ్లాక్ క్యాప్స్ ఎగరేసుకెళ్తారు.












Click it and Unblock the Notifications