ట్యాంపరింగ్ కుదరదంట..! నిజామాబాద్ బరిలో M-3 ఈవీఎంలు
నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా? ఈవీఎం యంత్రాలా?.. ఇంతకు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఏ పద్దతిలో జరగనున్నాయనే చర్చ పెద్దఎత్తున జరిగింది. ఈ అంశంపై తీవ్ర కసరత్తు చేసిన ఎన్నికల సంఘం చివరకు జంబో ఈవీఎంలకు జై కొట్టింది. నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో.. M-3 రకం ఈవీఎంలు వాడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరో వాదన తెరపైకి వచ్చింది. బ్యాలెట్ పేపర్ ఈజీగా ఉంటుందా.. లేదంటే మెగా ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సులువవుతుందా? అనే టాపిక్ మొదలైంది.
M-3 టైప్ ఈవీఎంలు
నిజామాబాద్ లోక్సభ పోరు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు బరిలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులు.. అలా మొత్తం 185 మంది ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. అయితే అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉండటంతో.. సాధారణ ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సాధ్యపడదు. ఆ క్రమంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్లు ఉండబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. చివరకు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో M-3 టైప్ ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు.
కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?
బ్యాలెట్ తతంగం కన్నా.. ఇదే ఈజీ..!
బ్యాలెట్ బాక్సులను పోగు చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ అంతా సులువుకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఎన్నికల సంఘం M-3 రకం ఈవీఎంలు బెటరనే నిర్ణయానికి వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న M-3 రకం ఈవీఎంలను సేకరించేపనిలో పడ్డారు అధికారులు.
M-3 రకం ఈవీఎంలను.. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సంయుక్తంగా తయారుచేశాయి. అత్యధికంగా 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే.. ఈ యంత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించడం చాలా ఈజీ. ఎన్నికల సంఘం దగ్గర M-3 రకం ఈవీఎంలు కొన్ని మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అవసరమనుకుంటే ఈసీఐల్ అధికారులను సంప్రదించి సరఫరా చేయల్సిందిగా కోరే అవకాశముంది.
M-3 ఈవీఎంలతోనే ఎన్నికలు
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ లెక్కన 1,788 M-3 టైపు ఈవీఎంలు అవసరముంటుంది. అలాగే మొత్తం 26,820 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు ఎన్నికల అధికారులు. 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లను వినియోగించనున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ వెల్లడించారు.
1996లో నల్గొండ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 480 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య నివారించి మంచినీళ్లు అందించాలనే డిమాండ్ తో సామాన్యులు పోటీకి సై అన్నారు. ఆ సమయంలో ఈవీఎంలు కాకుండా జంబో సైజు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించారు ఆనాటి ఎన్నికల సంఘం అధికారులు. అయితే M-3 రకం ఈవీఎంలు 2007 తర్వాత అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కూడా 384 మంది వరకు అభ్యర్థులుంటేనే సరిపోతుంది. 384 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే ఇవి కూడా పనిచేయవన్నమాట.
ట్యాంపరింగ్ కుదరదంట..!
2018, మే లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో M-3 రకం ఈవీఎంలను వినియోగించారు. థర్డ్ జనరేషన్ అని మరో పేరుతో పిలిచే ఈ యంత్రాలు అధునాతన టెక్నాలజీ సొంతం చేసుకున్నాయి. ఎవరైనా ట్యాపరింగ్ చేయాలని చూస్తే ఆకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతాయి. అంతేకాదు వాటిలో సెల్ఫ్-డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. అంటే వాటికవే స్వయం నియంత్రణ చేసుకుంటాయన్నమాట. ఇంటర్నల్ గా నిరంతరం చెకింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఆ సమయంలో ఏదైనా తేడా కొట్టినట్లు అనిపించినా.. పనిచేయడం ఆగిపోతాయి. అందులో జీపీఎస్ కూడా ఉంటుంది. ఎవరైనా ఎత్తుకెళ్లాలని ప్రయత్నించినా కుదరదన్నమాట. ఏ లొకేషన్ లో ఉన్నా.. పోలీసులకు ఈజీగా పట్టిస్తుంది.