గరిష్ట నీటిమట్టానికి చేరిన వర్షపునీరు, 2 గంటల్లో ఎస్సారెస్పీ గేట్లు ఓపెన్..
ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్కు వస్తున్న ఇన్ ఫ్లో 79,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులు, 79 టీఎంసీలకు చేరింది. దీంతో ప్రాజెక్టు ఈఈ చక్రపాణి హెచ్చరిక జారీచేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పెరుగుతోన్న నీటి మట్టం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు గేట్లు మరో రెండు గంటల్లో తెరిచే అవకాశం ఉంది. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈఈ చక్రపాణి కోరారు. గొర్ల, బర్ల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు నదిలోకి వెళ్లరాదని కోరారు.
ఆరుగేట్లు ఎత్తి..
ఇటు జూరాల ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.750 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 6.325 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 58,600 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 68,422 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దిగువకు శ్రీశైలం వైపు 66,090 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Recommended Video
జగిత్యాల జిల్లాలో
రాత్రి నుంచి వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉదయం కూడా రెయిన్ కంటిన్యూ అవుతోంది. దీంతో వాగులు, వంకలు నిండుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రహదారులపైకి భారీగా వర్షపునీరు వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలతోపాటు పలు గ్రామాల్లో భారీగా వర్షం కురుస్తోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్, వర్షకొండ, పకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య లోలెవెల్ వంతెన మునిగిపోయింది. దీంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.