కాషాయం Vs గులాబీ : నిజామాబాద్ మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్ : జెండా పాతేది ఎవరు..?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 120 మున్సిపాలిటీల్లో ఏకంగా 111 మున్సిపాలిటీలను పార్టీ కైవసం చేసుకుంది. అలాగే 9 కార్పోరేషన్లలో 8 కార్పోరేషన్లను కైవసం చేసుకుంది. మిగిలిన ఒక కార్పోరేషన్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్,బీజేపీ పోటీ పడుతున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి.
నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు
నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాల్లో మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో బీజేపీ, 13 స్థానాల్లో టీఆర్ఎస్,16 స్థానాల్లో ఎంఐఎం, 2 స్థానాల్లో కాంగ్రెస్,ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నిజామాబాద్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
టీఆర్ఎస్ బలమెంత..
టీఆర్ఎస్కు ఎలాగు మిత్రపక్షం ఎంఐఎం మద్దతు ఉంటుంది. దాంతో పాటు ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి,ఎమ్మెల్సీలు వీజీ గౌడ్ (ఎమ్మెల్యే కోటా), ఆకుల లలిత (ఎమ్మెల్యే కోటా), రాజేశ్వర్రావు (గవర్నర్ కోటా)లు ఎక్స్అఫీషియో కింద టీఆర్ఎస్కు అదనపు బలం కానున్నారు. ఈ లెక్కన టీఆర్ఎస్ 13,ఎంఐఎం 16,ఎక్స్అఫీషియో 6 ఓట్లను కలిపితే.. అధికార పార్టీ బలం 35కి చేరుతుంది. దీంతో మేయర్ పీఠాన్ని ఆ పార్టీ సునాయాసంగా చేజిక్కించుకునే అవకాశం ఉంది.
టీఆర్ఎస్కేనా లేక ఎంఐఎం..
మేయర్ పీఠాన్ని టీఆర్ఎసే దక్కించుకుంటుందా.. లేక మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఎంఐఎం మేయర్ పీఠం కావాలని టీఆర్ఎస్ను కోరితే సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరం. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం తమ పార్టీయే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
హోరాహోరీ ప్రయత్నాలు..
మరోవైపు బీజేపీ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. రెండు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ను,బీజేపీ రెబల్ అభ్యర్థి మరాఠి యమునను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. అలాగే ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటు కూడా చేరుతుంది. ఈ లెక్కన బీజేపీ సొంతంగా గెలుచుకున్న 28 స్థానాలు, కాంగ్రెస్2, రెబల్1 స్థానం,ఎక్స్అఫీషియో ఓటును కలుపుకుంటే బీజేపీ బలం 32కి చేరుతుంది. అయితే టీఆర్ఎస్ కంటే ఇది తక్కువే కావడం గమనార్హం. అయినప్పటికీ మేయర్ స్థానాన్ని తామే దక్కించుకుంటామని బీజేపీ చెబుతోంది. ఒకవేళ బీజేపీ గనుక నిజామాబాద్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంటే ధర్మపురి అరవింద్కు ఇది రెండో విజయం లాంటిదే. రాష్ట్రమంతా ప్రభంజనం సృష్టించి నిజామాబాద్లో మేయర్ పీఠాన్ని కోల్పోవడం టీఆర్ఎస్కు కూడా ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి ఈ సీటును ఎలాగైనా తామే దక్కించుకోవాలని టీఆర్ఎస్,మరోసారి టీఆర్ఎస్పై పైచేయి సాధించాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.