సుజనా చౌదరితో కరణం బలరాం భేటీ ... నేతల వరుస భేటీలతో టీడీపీలో టెన్షన్
టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టిడిపిని టార్గెట్ చేస్తున్నారా? టిడిపి నేతలను బిజెపి లో చేర్చుకోవడానికి సుజనా చౌదరి పావులు కదుపుతున్నారా? అన్న అనుమానాలు తాజా రాజకీయ పరిణామాల బట్టి కలుగుతున్నాయి. టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,అలాగే టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
రాజధానిపై కమిటీ ఎందుకు? అమరావతి రైతుల ముందుకు వస్తారా ? ... చంద్రబాబు, బుద్దా ఫైర్
నేడు ఒంగోలు పర్యటనకు వెళ్తూ మధ్యలో సుజనా చౌదరి గుంటూరు వచ్చిన నేపథ్యంలో వల్లభనేని వంశీ అక్కడకు వచ్చి ప్రత్యేకంగా సుజనాతో భేటీ అయ్యారు. తరువాత ఆయనతో కలిసి ఆయన కారులోనే ఒంగోలుకు కూడా వెళ్లారు వంశీ. ఒక వైపు టీడీపీ ఏపీలో ఇసుక కొరత..ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు నిర్వహిస్తుంటే వల్లభనేని వంశీ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకోకుండా సుజనాతో కలిసి ఒంగోలు వెళ్లి ఆయనతో భేటీ అవ్వటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒంగోలులో గాంధీజీ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలే చెబుతారని అన్నారు. వైసీపీ పరిపాలన మీద దృష్టి సారించడం లేదని విమర్శించిన ఆయన బీజేపీలో చేరమని ఎవరినీ టార్గెట్ చేయలేదని అన్నారు. ఇక సుజనా ఒంగోలు వెళ్ళిన నేపధ్యంలో ఒంగోలులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ కావడం చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు , తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఉదయం వల్లభనేని వంశీ భేటీ కావడం మధ్యాహ్నం కరణం బలరాం సుజనా చౌదరితో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఆయనతో ఉన్న పరిచయంతోనే సమావేశమయ్యానని కరణం బలరాం చెప్పుకొచ్చినప్పటికీ వీరి భేటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టిడిపిలో సైతం టిడిపి నేతలు సుజనా చౌదరి తో వరుసగా భేటీ కావడం టెన్షన్ పుట్టిస్తుంది. అయితే బీజేపీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారి సమర్ధత, సామర్ధ్యం చూసి ఆహ్వానిస్తామని సుజనా చెబుతుండడం కూడా అనేక అనుమానాలకు కారణం అవుతుంది.