థ్యాంక్స్ టూ వారియర్స్: కరోనాను జయించిన ఏకైక జిల్లా ప్రకాశం
అమరావతి: ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రకాశం జిల్లా మాత్రం ఆ మహమ్మారిని జయించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించింది. జిల్లాలో కరోనా బారినపడ్డ బాధితులంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది.
కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఏపీలో కరోనా బారినపడ్డ వారందరూ కోలుకున్న మొట్టమొదటి జిల్లాగా ప్రకాశం నిలిచింది. అందరూ కోలుకున్నా.. జిల్లాలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇకపై కూడా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనాను పారదోలాలని జిల్లా ప్రజలను కోరింది. కాగా, ప్రకాశం జిల్లాలో మొత్తం 63 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడ్డ వారందరూ శనివారానికి డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం జిల్లాలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు ఉండగా, ఆ తర్వాత ఒకే రోజు రెండు కేసులు నమోదయ్యాయి.
#Prakasam is the first district in AP to have all #COVID19 positive patients recovered and discharged. However, the district will continue to be under surveillance and we recommend people in the district to #StayHomeStaySafe#APFightsCorona pic.twitter.com/qK78BTJDXF
— ArogyaAndhra (@ArogyaAndhra) May 16, 2020
ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా మూడు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, శనివారం ఒక్కరోజే ఆ ముగ్గురు కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రకాశం జిల్లాలో యాక్టివ్ కేసులు జీరోకు చేరుకున్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 2205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 803 మంది కోలుకున్నారు. 1353 మంది డిశ్చార్జ్ అయ్యారు. 49 మరణాలు చోటు చేసుకున్నాయి.