కలిసొస్తున్న పరిస్ధితులు- గోదావరిలో తగ్గిన ప్రవాహవేగం.. జెట్ స్పీడ్ లో పోలవరం పనులు..
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. గతంతో పోలిస్తే నిధుల విషయంలో కానీ, అనుమతుల విషయంలో కానీ, పరిస్ధితుల విషయంలో కానీ సమస్యలు తొలగిపోవడంతో పనుల వేగం అసాధారణంగా పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడంతో నిధుల లభ్యత పెరిగింది. అదే సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం కూడా తగ్గడంతో పనుల వేగం పెరిగినట్లు తెలుస్తోంది.
Recommended Video

జోరుగా పోలవరం.. జెట్ స్పీడ్ తో..
గోదారిలో వరద తగ్గింది. పనుల వరద పరుగులు పెడుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే అనుకున్న సమయానికి ప్రాజెక్టు కల సాకారమవుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్ధితి ఇది. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ కొత్త ఏజెన్సీ, సవరించిన అంచనాలకు ఆమోదం, గోదావరిలో తగ్గిన ప్రవాహం నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అశాస్త్రీయ పనులను సవరిస్తూ ఇంజనీరింగ్ పద్ధతిలో పనుల వేగం పెంచడం ప్రాజెక్టుకు కలిసివస్తోంది.

పోలవరానికి గోదారమ్మ సాయం...
మొదలు పెట్టిన ఏ పని విజయవంతం కావాలన్నా.. సరైన సమయం తప్పనిసరి. పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగం అందుకోవాలంటే ఇదే సరైన సమయం. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ తన శక్తియుక్తులన్నింటినీ ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నిధుల కొరతతో ఎదురైన ఇబ్బందులకు తాజాగా చెక్ పడటంతో పోలవరం ఇప్పుడు పరుగులు పెడుతోంది. ఇదే ఊపు కొనసాగితే నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమేమీ కాదనేలా పనులు సాగుతున్నట్లు తాజాగా పోలవరం వెళ్లి వచ్చిన అధికారులు చెబుతున్నారు.

మేఘా అనుభవం అదనపు బలం..
గతంలో తెలంగాణలో కాళేశ్వరంతో పాటు పలు కీలక ఇంజనీరింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ధ తాజాగా పోలవరం కాంట్రాక్టు దక్కించుకుంది. గతంలో నవయుగ సంస్ధ ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా తన అనుభవాన్ని ఉపయోగించి విదేశీ ఇంజనీరింగ్ నైపుణ్యంతో మేఘా ఇంజనీరింగ్.. ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తోంది.
గతంలో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలో తనకున్న ట్రాక్ రికార్డును కొనసాగించాలంటే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడం మేఘాకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో సంస్ధలో తమకున్న అత్యుత్తమ నైపుణ్యాన్ని ఇక్కడ వినియోగిస్తోంది.

ఇదీ పోలవరం పనుల పురోగతి...
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే కు సంబంధించి మొత్తం 62,818 ఘనపు మీటర్ల పని పూర్తయింది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21 వేలకు పైగా ఘ.మీ పనిని మేఘా సంస్ధ పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే బీమ్ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్వాల్ పనులను ఉదృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్ని కీలక పనులు వేగవంతం చేసేందుకు గోదావరి నడిఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం అయ్యాయి.

ప్రత్యేక అధికారులతో అనుమతులు..
ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష్యం మేరకు పనులు చేయాలి. అందుకు అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్లకు సంబంధించిన అనుమతులు సాధించాలి. ఈ రెండు చాలా కీలకమైనది. ఇప్పుడు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్లకు అనమతులు లభించకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మొదటికి వస్తుంది. సీఎం జగన్ ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా త్వరగా అనుమతులు ఇప్పిస్తే సకాలంలో పనులు పూర్తి చేస్తామని మేఘా యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో డిజైన్ల అనుమతుల కోసం ఢిల్లీ, హైదరాబాద్ లో ఇద్దరు ప్రత్యేక అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత పనుల వేగం మరింత పెరిగింది.

గత ప్రభుత్వ తప్పిదాలు..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఇంజనీరింగ్ విధానాలు స్పష్టంగా ఉన్నా గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. పైగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సంక్షిష్టంగా మార్చేసింది. దీంతో కొద్దిపాటి వరదలకే ప్రాజెక్ట్ లోకి నీరు చేరడమే కాకుండా గ్రామాలు మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. తాజాగా ఆ సమస్యను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావడంతో పనుల వేగం పెరిగింది.
వాస్తవానికి గత నవంబర్లో ప్రాజెక్ట్ పనులను మేఘా సంస్థ దక్కించుకున్నా... వెంటనే పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. దీంతో మూడు నెలల విలువైన సమయం వృధా అయింది. గత ప్రభుత్వం మెయిన్ డ్యాం కంటే కాఫర్ డ్యాం నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. అప్పట్లో కాఫర్ డ్యామ్ పూర్తిచేసి ఎంతో కొంత నీటిని నిలబెట్టి, దాని నుంచి కుడి, ఎడమ కాలువలకు వరద సమయంలో నీటిని విడుదల చేయడం ద్వారా ప్రాజెక్ట్ పాక్షికంగా పూర్తి చేశామని అనిపించుకునేందుకు జరిగిన ప్రయత్నాలే కారణం.

పోలవరం ప్రాజెక్టు డిజైన్లే కీలకం...
గతేడాది వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ లో భాగంగా నిర్మాణ సంస్థను మార్చి పనుల వేగం పెంచింది. అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులల్లో అనుమతులు చాలా కీలకమైనవి. గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసింది. మొత్తం ప్రాజెక్ట్ లో 45 డిజైన్లకు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి లభించలేదు. ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వెనుక కారణం కూడా ఇదే. కానీ సీఎం జగన్ కీలక అనుమతులు సాధించడంలో సక్సెస్ కావడంతో పనుల వేగం కూడా పెరిగింది. మార్చి 8న హైదరాబాద్లో ప్రాజెక్ట్ డిజైన్ల కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించడం ద్వారా పెండింగ్ లో ఉన్న 8 డిజైన్లకు సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదనలను డ్యామ్ డిజైన్ల సమీక్ష బృందం పరిశీలించి కొన్నింటిని తిరస్కరించింది. ముఖ్యంగా ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) మూడో గ్యాపులో మట్టికట్ట నిర్మించాలనే ప్రతిపాదనను నిర్ద్వంధంగా తోసిపుచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా కాంక్రిట్ నిర్మాణం చేపడితేనే ప్రాజెక్ట్ వరదల సమయంలో పటిష్టంగా ఉంటుందని తేల్చిచెప్పింది. ఇంజనీరింగ్ నిపుణులకు ఈ విధమైన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు అతీతంగా ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ప్రాజెక్ట్ డిజైన్ల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని సీడబ్ల్యూసి చైర్మన్ ఏ.డి.పాండ్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. దాంతో పెండింగ్లో ఉండిపోయిన అప్రోచ్ ఛానెల్ ఎడమ గట్టుపై ర్యాక్ ఫిల్ గైడ్వాల్ నిర్మించడం, స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఎడమ గట్టువైపు పటిష్టమైన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ రూపొందించాలని నిర్ణయించింది.
స్పిల్ వే నుంచి విడుదలయ్యే వరద నీరు కుడిగట్టుపై పడుతుంది. దీనికి కూడా పటిష్టమైన డిజైన్ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. స్పిల్ ఛానెల్ నుంచి వరద నీరు పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరి నదిలోకి కలిసే పనులకు సంబంధించి డిజైన్ను కేంద్ర జలసంఘానికి ప్రాజెక్ట్ అధికారులు సమర్పించారు. దీనికి త్వరితగతిన అనుమతి సాధించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్లో ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విధంగా అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. దీంతో ప్రాజెక్టు 2021 కల్లా పూర్తయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి












Click it and Unblock the Notifications