అజ్ఞాతంలో 75 రోజులు: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్
అమరావతి: ఎట్టకేలకు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన శుక్రవారం రాజమండ్రికి రావడంతో ట్రిటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దూషించిన కేసులో అరెస్ట్
జ్యూడీషియల్ సిబ్బందిని దూషించిన కేసులో హర్ష కుమార్ను అరెస్ట్ చేశారు. హర్ష కుమార్పై 353, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మాజీ ఎంపీ హర్ష కుమార్ ను రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జీ ముందు హాజరుపర్చారు.

కక్ష సాధింపు చర్యలు
కాగా, పోలీసుల తీరుపై హర్ష కుమార్, ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. తమ నేతను వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నాపై ఎందుకంత కసి అంటూ..
తనపై ఎందుకింత కసి అని గతంలో హర్ష కుమార్ వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు విమానాశ్రయాలను కూడా వదలడం లేదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 353, 354 సెక్షన్ల కింద కేసు పెట్టిన ఎంత మంది గురించి విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారో చెప్పగలరా? అని ఆయన ఏపీ డీజీపీని ప్రశ్నించారు. కనీసం ఇలాంటి కేసు ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు.

ఇన్ని రోజులూ తెలంగాణలోనే..
కాగా, హర్ష కుమార్ గత కొద్ది రోజులుగా తెలంగాణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. గురువారం ఓ ఫంక్షన్లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం రాజమండ్రికి రావడంతో నిఘా పెట్టిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications